రాజ్యంగం హక్కులతో పాటు బాధ్యతలను ప్రసాదించింది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రమాదంలో పడినప్పుడు ప్రజలే దాన్ని రక్షించుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. 130 మంది కోట్ల ప్రజలు ఇప్పటికీ రాజ్యాంగాన్ని విశ్వసిస్తున్నారని ప్రధాని చెప్పారు. అయితే ఇదే రోజున ముంబై మారణహోమం జరగడం చాలా బాధాకరం అని ప్రధాని వెల్లడించారు. నాటి మారణహోమంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. రాజ్యాంగం ఆమోదించుకుని నేటితో 70 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పిన ప్రధాని దాన్ని ఏమేరకు పాటిస్తున్నామనేదానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు.
భారత రాజ్యాంగం పౌరులకు హక్కులను, బాధ్యతలను ప్రసాదించిందని చెప్పిన ప్రధాని మన రాజ్యాంగంలో ఉన్న ప్రత్యేకతే అది అని గుర్తుచేశారు. మన బాధ్యతలు నెరవేర్చకుండా మన హక్కులను పరిరక్షించుకోలేమని చెప్పారు. భారతీయులకు గౌరవం గుర్తింపు, భారతదేశ సమగ్రత అనే రెండు అంశాలు రాజ్యాంగ మంత్రాలని పేర్కొన్నారు.
గత 70 ఏళ్లలో భారత రాజ్యాంగం మరింత బలపడిందని చెప్పిన ప్రధాని మోడీ... ప్రపంచ దేశాల రాజ్యాంగాలతో పోలిస్తే భారత రాజ్యాంగం అత్యంత లౌకికత్వం కలిగినదని కొనియాడారు. జ్ఞానం ప్రసాదించడంలో పార్లమెంటు ఒక మహా కుంభమేళ లాంటిదని ప్రధాని అన్నారు. ప్రజలతో సంబంధాలు కలిగి వారు ఎలాంటి పాలన కావాలనుకుంటున్నారో గ్రహించి ఆమేరకు నడుచుకోవాలని ప్రధాని మోడీ ప్రజాప్రతినిధులకు సందేశమిచ్చారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో చోటుచేసుకున్న పరిణామాలకు బీజేపీనే కారణమంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలను శివసేన బహిష్కరించింది. బీజేపీ ప్రజాస్వామ్యంను ఖూనీ చేసిందని ఆరోపించింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా సోనియాగాంధీ నేతృత్వంలో మహారాష్ట్ర డెవలప్మెంట్స్ పై నిరసన వ్యక్తం చేసింది. రాజ్యాంగ దినోత్సవ వేడుకలను బహిష్కరించాలా వద్ద అనేది విపక్షాలన్నీ సమావేశమై వేడుకలను బహిష్కరించాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది.