అవినీతిలో నాయకుల్ని మించుతారు: పారికర్ వివాదాస్పద వ్యాఖ్యలు
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఓ కార్యక్రమంలో అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారులకు రాజ్యాంగబద్ధంగా పూర్తి అధికారం ఇస్తే వారు అవినీతిలో రాజకీయ నాయకులను మించిపోతారని వ్యాఖ్యానించారు.
పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఓ కార్యక్రమంలో అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారులకు రాజ్యాంగబద్ధంగా పూర్తి అధికారం ఇస్తే వారు అవినీతిలో రాజకీయ నాయకులను మించిపోతారని వ్యాఖ్యానించారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులకు గానూ రూ.16.80 కోట్లు ఖర్చైనట్లు గోవా ఎన్నికల అధికారులు చూపించారు. ఆ మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన పారికర్ ఈ లెక్కలపై ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రెండున్నర నెలల ఎన్నికల విధుల్లో రూ.16.80 కోట్లు ఖర్చైనట్లు ఎన్నికల అధికారులు చూపించారన్నారు. రాజ్యాంగబద్ధంగా నియమితులైన అధికారులను తప్పుబట్టడం తన ఉద్దేశం కాదన్నారు.
అలా అంటూనే, ఒకవేళ వారికే గనక పూర్తి అధికారాలను కట్టబెడితే అవినీతిలో రాజకీయ నాయకులను మించిపోతారన్నారు. ప్రతీ అయిదేళ్లకోసారి వచ్చే రాజకీయ నాయకులకు జవాబుదారీతనం ఉంటుందని, ఏం జరిగినా అందుకు బాధ్యుడిగా ఉంటారన్నారు.
రోడ్డుపై ఎవరైనా చెత్తపడేసినా దానికి రాజకీయ నాయకుడే సమాధానం చెప్పాల్సి ఉంటుందని, ఇలాంటి జవాబుదారీతనం రాజ్యాంగబద్ధ అధికారులకు కూడా ఉండాలని ని వ్యాఖ్యానించారు. కోర్టు వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని పంచాయతీ వార్డులకు ఎన్నికలు నిలిచిపోయాయని, దానికి ఎవరు జవాబుదారీ? అని ప్రశ్నించారు.