ఆ రంగాల్లో తీవ్ర సంక్షోభం: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన
న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ దేశ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలుమార్లు ఆర్థిక వృద్ధి పడిపోవడం వల్ల కలిగిన నష్టాలను ప్రాస్తవించిన ఆయన.. తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయని రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ఇండియా టుడూ పత్రికలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టానికి చేరిందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగిత రేటు కూడా తీవ్రస్థాయిలో ఉందని రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. రియల్టీ, కన్స్ట్రక్చన్, మాన్యూఫ్యాక్చర్ కంపెనీలకు పెద్ద మొత్తంలో రుణాలిచ్చే ఎన్బీఎఫ్సీ(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్)ల ఆస్తుల నాణ్యతను పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు.
కేంద్ర బ్యాంక్.. టాప్ 50 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పనితీరును సమీక్షిస్తుందని తెలిపారు. అయితే, వాటి పనితీరును, వాటి ఆస్తుల క్వాలిటీని కూడా సమీక్షించాలని ఆర్బీఐకి ఆయన సూచించారు. ఇక షాడో బ్యాంకింగ్ రంగంలో మొత్తం ఆస్తులలో 75 శాతం వాటా ఉన్న టాప్ 50 ఎన్బీఎఫ్సీలను సెంట్రల్ బ్యాంక్ నిశితంగా పరిశీలిస్తుందని ప్రస్తుత గవర్నర్ శక్తికాత దాస్ గురువారం మీడియాకు వెల్లడించారు.
పెద్ద ఎన్బీఎఫ్సీలు కుప్పకూలకుండా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అయితే, నిర్మాణ రంగ ప్రాజెక్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సుమారు 66 బిలియన్ల అమెరికన్ డాలర్ల మేర బకాయిలు ఉన్నట్లు ఇటీవల ఓ సర్వే తెలియజేసిందని పేర్కొన్నారు.