ఛాయ్, సమోసే కాదు.. ఇకపై రైళ్లల్లో అన్నీ దొరుకుతాయ్
ఢిల్లీ : నడిచే రైళ్లల్లో ఛాయ్, సమోసా అమ్ముతున్నట్లుగానే వివిధ రకాల వస్తువులు ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరి నుంచి ఈ నిర్ణయం అమలుకానుంది. దీంతో రైలు ప్రయాణీకులకు కొత్త షాపింగ్ అనుభూతి కలగనుంది. గృహోపకరణాలు, కాస్మొటిక్స్ తదితర వినియోగ వస్తువులు రైళ్లల్లో అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి ప్రైవేట్ సంస్థతో ఒప్పందంద కుదుర్చుకుంది వెస్ట్రన్ రైల్వే ముంబై డివిజన్. ఐదేళ్ల కాంట్రాక్ట్కు గాను మూడున్నర కోట్లకు లైసెన్స్ కూడా ఇచ్చేసింది. 16 మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో సదరు సంస్థ అమ్మకాలు జరుపుకోవచ్చు. తొలిదశలో భాగంగా రెండు రైళ్లల్లో వస్తు విక్రయ ప్రయోగం జరగనుంది. అనంతరం దశలవారీగా విస్తరించాలనేది రైల్వే అధికారుల ఆలోచన.
ప్రతిదానికి కండిషన్స్ అప్లై అనే ఒక కొర్రీ ఉంటుంది గదా. ఈ కాంట్రాక్ట్కు కూడా అలానే ఒకటుంది. తినుబండారాలతో పాటు మత్తుపదార్ధాల్లాంటివి ఈ సంస్థ అమ్మకూడదనేది కండిషన్. అంతేకాదు ఏయే వస్తువులు అమ్ముతున్నారు, వాటి ధర ఎంత తదితర వివరాలతో ఛార్ట్ తప్పనిసరిగా ఉండాలి. పొద్దున 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే సదరు సంస్థ రైళ్లల్లో విక్రయాలు జరపాల్సి ఉంటుంది. డ్రెస్కోడ్ తో ఇద్దరు సిబ్బంది వస్తువులు విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఛాయ్, సమోసా అమ్మేవాళ్లలాగా బిగ్గరగా అరవరాదనే నిబంధన కూడా ఉంది.