ఎవరూ ఆ ఛార్జీ చెల్లించకండి: దెబ్బకు దిగొచ్చిన కేంద్రం
కస్టమర్లు లేదా పెట్రో పంప్ డీలర్లు కార్డు పేమెంట్స్ పైన ఎలాంటి సర్ ఛార్జీ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది.
న్యూఢిల్లీ: క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల పైన విధించే సర్ ఛార్జీ పైన కేంద్రం దిగి వచ్చింది. కస్టమర్లు లేదా పెట్రో పంప్ డీలర్లు కార్డు పేమెంట్స్ పైన ఎలాంటి సర్ ఛార్జీ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం సోమవారం నాడు వెల్లడించింది.
పెట్రో కొనుగోలుపై వసూలు చేద్దామనుకున్న సర్ ఛార్జీని కేంద్రం రద్దు చేయడం అటు పెట్రో డీలర్లకు, అటు వినియోగదారులకు ఊరట కలిగించే విషయం.
ఎవరైనా కార్డు వినియోగిస్తే ఒక శాతం పన్ను విధించడంపై పెట్రో డీలర్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తాము ఎట్టి పరిస్థితుల్లోను కార్డుల ద్వారా డబ్బులు తీసుకునేది లేదని పెట్రో డీలర్లు చెప్పడంతో కేంద్రం తగ్గింది.
పెట్రో ఝలక్: అర్ధరాత్రి నుంచి బంకుల్లో ఏటీఎం కార్డులు బంద్
కాగా అంతకుముందు, క్యాష్ లెస్కు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడినట్లుగా కనిపించిన విషయం తెలిసిందే. కార్డుల వినియోగానికి ఛార్జీ వసూలు చేయాలని బ్యాంకులు నిర్ణయించాయి. దీంతో పెట్రో డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రభావంతో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. పెట్రోల్ బంకుల్లో ఈ ప్రభావం గణనీయంగా కనిపిస్తోంది. హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ బంకుల్లో గత కొన్నిరోజులుగా కార్డుల ద్వారా 90 శాతం అమ్మకాలు జరుగుతున్నాయి.
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్డుల వినియోగం 40 శాతానికి చేరింది. పెట్రోల్, డీజిల్ కొనుగోలును కార్డుల ద్వారా చేసే ఖాతాదారులకు ఆయా బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలు, సర్వీసు ఛార్జీలను కేంద్రం ఇప్పటి వరకు రద్దు చేసింది.
దీంతో నవంబరు 8వ తేదీ తర్వాత కార్డుల వినియోగం బాగా పెరిగింది. తాజాగా కార్డుల వినియోగంపై ఒక శాతం ఛార్జీని పెట్రోల్ బంకులే భరించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిని పెట్రో బంకుల యజమానులు వ్యతిరేకించారు.
ఇప్పటికే తమకు ఇస్తున్న కమీషన్ 2.6 శాతంలో ఒక్క శాతం పోతే మిగిలేది 1.6 శాతమని, ఇది ఏమాత్రం సరిపోదని చెప్పారు. ఛార్జీలు పోను మిగిలే 1.6 శాతంలోనే సిబ్బంది జీతాలు, బంకు నిర్వహణ ఖర్చులు, బ్యాంకు రుణానికి వడ్డీ తదితర వాటికి పోతే నష్టాలే మిగులుతాయని వాపోయాయి. ఓ వైపు డిజిటల్ దిశగా అడుగులు వేయాలని చూస్తున్న కేంద్రం.. ఎట్టకేలకు సర్ ఛార్జీ పైన తగ్గింది.