కాంట్రాక్ట్ కిల్లర్: కాగ్ వినోద్ రాయ్పై రాజా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: డీఎంకే నేత, మాజీ కేంద్రమంత్రి ఎ రాజా.. మాజీ కాగ్ వినోద్ రాయ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకే వినోద్ రాయ్ యత్నించాడంటూ రాజా ఆరోపించారు. శనివారం '2జీ సాగా అన్ ఫోల్డ్స్' అనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా రాజా.. వినోద్ రాయ్పై తీవ్ర విమర్శలు చేశారు.
'కొన్ని దుష్టశక్తులుయూపీఏ(2) ప్రభుత్వాన్ని చంపేందుకు ప్రయత్నించాయి. అందుకోసం వినోద్ రాయ్ను కాంట్రాక్ట్ కిల్లర్లా నియమించుకున్నాయి. ఆయనను ఓ ఆయుధంగా వాడుకుని కక్ష్య సాధింపు చర్యలకు దిగాయి. ఉన్నత పదవిని అడ్డుపెట్టుకుని వినోయ్ రాయ్ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు' అని రాజా ఆరోపించారు.
దేశాన్ని, ప్రజలను దారుణంగా మోసం చేశాడంటూ వినోద్ రాయ్పై విమర్శలు గుప్పించారు. అంతేగాక, మీడియా సంస్థలపైనా రాజా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొన్ని న్యూస్ ఛానళ్లు అదే పనిగా తనపై అసత్య ప్రచారాలను చేశాయని, కానీ, సీబీఐ ముందు తానిచ్చిన వాంగ్మూలం గురించి మాత్రం మాట వరుసకు కథనాలు ప్రసారం చెయ్యలేదని మండిపడ్డారు.
2010లో వినోద్ రాయ్ కాగ్((కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా)గా ఉన్న సమయంలో లక్షా76వేల కోట్ల రూపాయల 2జీ స్కాంను వెలుగులోకి తెచ్చారు. ఎ రాజా టెలికాం శాఖ మంత్రిగా(2008) ఉన్న సమయంలో ఈ అవినీతి చోటు చేసుకుందని కాగ్ నివేదిక వెల్లడించింది. దీంతో కేసు నమోదైంది. ఈ కేసులో చీటింగ్, ఫోర్జరీ, కుట్ర తదితర అభియోగాల కింద రాజాను 2011లో అరెస్ట్ చేశారు. కాగా, ఇటీవలే సీబీఐ కోర్టు.. 2జీ స్కాంలో నిందితులుగా ఉన్న రాజా, కనిమొళితోపాటు మరో 17మందిని నిర్దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే.