రాజస్థాన్ లో వివాదాస్పద బీజేపి మాజీ ఎమ్మెల్యే రాజీనామా..! ఏకమైన సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్..!
హైదరాబాద్ : రాజస్థాన్ లో రాజకీయలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ బీజేపి ఒకపార్టీ పైన మరో పార్టీ పై చేయి సాదించేందుకు అనేక ఎత్తుగడలు వేసుకుంటున్నారు నాయకులు. బీజేపిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు విభాదాలను పక్కనపెడుతుండగా, బీజేపీకి సొంతపార్టీ నేతల వ్యరవహారం తలనొప్పిగా పరిణమించింది. వివాదావస్పద ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామాలు చేస్తుండగా, విభేదాలను మరిచి కాంగ్రెస్ నేతలు ఐక్యతారాగం అందుకుంటున్నారు.
బీజేపి ఎమ్మెల్యే గయాన్ దేవ్ రాజీనామా.!! ఎన్నికల ముందు బీజేపికి షాక్..!!
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి తలనొప్పులు తీసుకువచ్చే రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే గయాన్ దేవ్ ఆహూజా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న రామ్గఢ్ నియోజకవర్గంలో పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. అయినా వెనక్కి తగ్గేదిలేదని, రామ జన్మభూమి, గో రక్షణ, హిందూత్వ వంటి ప్రచార అస్త్రాలతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్లు ఆయన సోమవారం ప్రకటించారు. గతంలో ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఢిల్లీ జవహర్లాల్ యూనివర్సిటీ లో అక్కడి విద్యార్థులు ప్రతి రోజూ మూడు వేలకు పైగా కండోమ్లు వాడుతారని, అమ్మాయిలు, అబ్బాయిలు విచ్చలవిడిగా తిరుగుతారంటూ వ్యాఖ్యలు చేసి వివాదంతో చిక్కుకున్నాడు.
సొంత పార్టీ నేతలపై కూడా నోరు పారేసుకున్న గయాన్ దేవ్..! వేటు వేసే దిశగా అదిష్టానం..!!
ఇతరులపైనే కాదు సొంత పార్టీ నేతలపై కూడా తలతిక్క మాటలతో విరుచుకుపడడం ఆయన నైజాం. ఇలా ప్రతిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరకాటంలో పెడతారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీంతో దేవ్ తీరుతో విసిగిన పార్టీ నాయకత్వం ఆయనను పక్కన పెట్టాలని భావించింది. దీనిలో భాగంగానే ఈసారి ఎన్నికల్లో టికెట్ నిరాకరించి.. ఆ స్థానంలో బీజేపీ నేత సక్వుత్ సింగ్ను బరిలో నిలిపింది.
కాంగ్రెస్ నేతల్లో ఐక్యతా రాగం..! సీనియర్ల మద్య చిగురిస్తున్న స్నేహం..!!
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సచిన్ పైలట్, అశోక్ గెహ్లెట్లు ఇద్దరూ పోటీ చేయనున్నారు. సీఎం పదవి రేసులో ఉన్న వారిద్దరూ పోటీకి దూరంగా ఉంటారని గతంలో ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయన్న కథనాల నేపథ్యంలో బుధవారం వారిద్దరూ కలిసి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాము ఇద్దరూ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సచిన్ పైలట్ సమక్షంలో అశోక్ గెహ్లెట్ ప్రకటించారు. రాహుల్ గాంధీ సూచన, గెహ్లెట్ జీ వినతి మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తాను నిర్ణయించినట్లు సచిన్ పైలట్ తెలిపారు.
విభేదాలు లేవని ప్రకటించుకున్న నేతలు..! సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహణ..!!
ఇద్దరి మధ్య విబేధాలు నెలకొన్నాయన్న కథనాలను వారు తోసిపుచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపేందుకు పార్టీ శ్రేణులందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. సీఎం పదవి కోసం ఇద్దరి మధ్య తీవ్రపోటీ నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరి మద్దతుదారులు రెండు వర్గాలుగా విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చని పలు ఒపీనియన్ పోల్స్ అంచనావేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు పోటీ చేస్తే వారి మద్దతుదారులు ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తారన్న అంచనాలతో ఇద్దరినీ ఎన్నికల బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే రాజస్థాన్ అసెంబ్లీకి ఒకే విడతలో డిసెంబరు 7న పోలింగ్ జరగనుండగా...ఓట్ల లెక్కింపును 11 తేదీన చేపట్టనున్నారు.