ఎయిమ్స్కు ఆశారాం: రైల్వే స్టేషన్లో అనుచరుల హల్చల్
న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన భద్రత మధ్య వివాదాస్పద స్వామి, అత్యాచారం కేసులో నిందితుడు ఆశారాం బాపును ఢిల్లీకి తీసుకుని వచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆశారాం బాపు పాత ఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకోగానే అక్కడికి పెద్ద యెత్తున ఆయన మద్దతుదారులువచ్చారు. ఆశారాంకు మద్దతుగా నినాదాలు చేశారు.
జోథ్పూర్ అత్యాచారం కేసులో బెయిల్ దరఖాస్తుకు సంబంధించి ఆ తర్వాత ఎయిమ్స్ వైద్య బృందం ఆయనకు పరీక్షలు నిర్వహించింది. ఆశారాం బాపును బుధవారం సాయంత్రం 17 మంది పోలీసుల రక్షణలో ఢిల్లీకి పంపించారు. పోలీసు బృందానికి ఎసిపి స్థాయి అధికారి నేతృత్వం వహించారు.
ఆశారాం మద్దతుదారులు, భక్తులు ఆందోళనకు దిగవచ్చుననే అనుమానంతో ఆయన ప్రయాణించిన రైలు వెళ్లే దారిలో ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేశారు. ర్యాపిడ్ ఆర్మ్డ్ కానిస్టుబలరీ 12వ బెటాలియన్ ఆయనను తీసుకుని, ఆస్పత్రికి చేర్చింది.
వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఆయనను రైల్వే స్టేషన్కు తీసుకుని వచ్చినట్లు సమాచారం. జోథ్పూర్ అత్యాచారం కేసులో బెయిల్ ఇవ్వవచ్చునా లేదా అనే విషయాన్ని తేల్చుకోవడానికి సుప్రీంకోర్టు - ఆశారాం బాపు వైద్య నివేదికలను పరిశీలించడానికి, అవసరమైతే పరీక్షలు నిర్వహించడానికి ఓ వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ డైరెక్టర్ను నిరుడు అక్టోబర్ 15వ తేదీన ఆదేశించింది.
ఆశారాం వైద్య పరీక్షలకు సుప్రీంకోర్టు నిజానికి డిసెంబర్ 3వ తేదీని నిర్ణయించింది. అయితే, భూమార్గంలో పయనించడానికి ఆశారాం నిరాకరించడంతో దాన్ని వాయిదా వేసింది. భూమార్గంలో తనను తీసుకుని వెళ్లకూడదని కోరుతూ ఆశారం చేసుకున్న విజ్ఞప్తిని తొలుత జోథ్ జిల్లా సెషన్స్ కోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు తోసిపుచ్చాయి.
ఆరోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆశారాం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. జోథ్పూర్ ఆస్పత్రి ఇచ్చిన వైద్య నివేదికలను ఆయన సుప్రీంకోర్టుకు సమర్పించాడు. దాంతో ఎయిమ్స్ నుంచి సుప్రీంకోర్టు తాజాగా వైద్య నివేదికను కోరింది.