అంతర్యుద్దానికి దారితీయవచ్చు.. ఎన్ఆర్సీపై రచయిత చేతన్ భగత్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ రచయిత,కాలమిస్ట్ చేతన్ భగత్ జాతీయ పౌరసత్వ పట్టిక(NRC)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్సీ అమలులోకి వచ్చిన మరుక్షణం.. ఆ చట్టం దుర్వినియోగం అవుతుందన్నారు. అంతేకాదు, ఇదొక అర్థం లేని అస్తవ్యస్తమైన చట్టం అని, అంతర్యుద్దానికి ప్రేరేపించగలదు అని అభిప్రాయపడ్డారు. ఎన్ఆర్సీ చట్టాన్ని అటకెక్కించాల్సిందేనని, లేదంటే దేశంలోని ప్రతీ ఒక్కరూ వేధింపులకు గురవుతారని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియా చానెల్ ఎన్డీటీవీతో ఎన్ఆర్సీపై చేతన్ భగత్ మాట్లాడారు.
బీజేపీపై విమర్శలు..
మత ప్రాతిపదికన ప్రజలను ఏకం చేయడానికే బీజేపీ ఎప్పుడూ ప్రయత్నిస్తోందని జనం భావిస్తున్నట్టుగా చేతన్ భగత్ చెప్పారు. ఇదే ఎన్ఆర్సీని వేరే ప్రభుత్వం తీసుకొచ్చి ఉండుంటే.. అందులో విశ్వసనీయత ఉంటే.. అప్పుడు స్పందన వేరేలా ఉండేదేమో అని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల సమాజంలో ఎంతో ఆందోళన నెలకొందని.. ముఖ్యంగా మైనారిటీ సమాజం తీవ్ర ఆందోళనకు గురవుతోందని చెప్పారు. బీజేపీకి ముందు నుంచి గుర్తింపు ఆధారిత రాజకీయాలు చేయడం అలవాటు అని విమర్శించారు.
సివిల్ వార్కి దారితీసే అవకాశం..
ఎన్ఆర్సీ సెక్యులర్ అయితే కావచ్చునని.. కానీ దానివల్ల భారతీయులందరికీ సెక్యులర్ వేధింపులు తప్పవని చేతన్ భగత్ ఎద్దేవా చేశారు. 'మాకు ఆధార్ ఉంది,ఓటర్ కార్డు ఉంది,పాస్పోర్టులు ఉన్నాయి. ఇంకా ఎన్నిసార్లు మేము భారతీయులమే అని నిరూపించుకోవాలి' అని ప్రశ్నించారు. ఇదో అర్థం లేని అస్తవ్యస్తమైన చట్టం అని,దీనివల్ల చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాదు,అంతర్యుద్దానికి దారితీసే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరించారు.
వాళ్లనేం చేస్తారు...
ఎన్ఆర్సీ అనేది అత్యంత వ్యయంతో కూడుకున్న ప్రాజెక్ట్ అని చేతన్ భగత్ అన్నారు. ఒకవేళ తమ వద్ద అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉండి కూడా.. అధికారులు వాటిని తిరస్కరిస్తే అవకాశం ఉందని చెప్పారు. అప్పుడు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ఎన్ఆర్సీ ద్వారా దేశంలో 5శాతం మంది అక్రమంగా ఉంటున్నారని తేలినా.. దాదాపు ఆ 6 కోట్ల జనాభాను ఏం చేస్తారని చేతన్ భగత్ ప్రశ్నించారు. వాళ్లకు మీరేమీ చేయలేరని, అలా అని ఇక్కడి నుంచి పంపిచడం కూడా చేయలేరని పేర్కొన్నారు.
చివరలో ట్విస్ట్ ఇచ్చిన చేతన్ భగత్..
ఎన్ఆర్సీపై చివరలో చేతన్ భగత్ పెద్ద ట్విస్టు కూడా ఇచ్చారు. ఎన్ఆర్సీ అనేది సిద్దాంత ప్రకారం చెడ్డదేమీ కాదని అన్నారు. ఎన్ఆర్సీని శాశ్వతంగా అటకెక్కించమని తాను చెప్పట్లేదని.. కానీ సుదీర్ఘ కాలంకోల్డ్ స్టోరేజీలో ఉంచాలని అన్నారు. అన్ని వ్యవస్థలు సరిగా ఉన్నప్పుడు.. చట్టాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి లేనప్పుడు దాన్ని తీసుకురావాలని చెప్పారు.