నిత్యానంద మరో సంచలనం- కైలాస దేశంలో రిజర్వుబ్యాంకు- కొత్త కరెన్సీ కూడా...
ఒకప్పుడు కర్నాటక రాష్ట్రంలో ఆశ్రమం స్ధాపించి లీలలు ప్రదర్శించిన స్వామి నిత్యానంద ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన భక్తుల కోసం మరిన్ని లీలలు ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్యే తాను నెలకొల్పిన కైలాస దేశానికి రిజర్వు బ్యాంకు, కొత్త కరెన్సీతో పాటు మరిన్ని హంగులు అద్దేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆయన ఇస్తున్న ఆఫర్లను చూస్తుంటే ప్రపంచ దేశాలకు నిజంగానే దిమ్మతిరిగి పోతోంది. వీటిపై తన కైలాస దేశం ఉందని చెబుతున్న ఈక్వెడార్ మాత్రం అంత సీన్ లేదంటోంది.
Recommended Video
నిత్యానంద మరో లీల...
కర్ణాటకలోని బిడిదిలో ఆశ్రమాన్ని స్ధాపించి అందులో యువతులను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద పోలీసులు అరెస్టు చేసి బెయిల్ ఇచ్చాక అజ్ఞాతంలోకి పారిపోయారు. ఆ తర్వాత ఈక్వెడార్కు సమీపంలో హిందువుల కోసం ఓ దేశం కొనుగోలు చేసినట్లు, దానికి కైలాస పేరు పెట్టినట్లు తన వెబ్సైట్ ద్వారా ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఏకంగా ఆయన తన దేశంలో రిజర్వు బ్యాంక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే కొత్త కరెన్సీని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నిత్యానంద చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపుతోంది.
బ్యాంకులతో ఒప్పందాలు..
కైలాస దేశంలో రిజర్వు బ్యాంకు పెట్టేందుకు సిద్ధమవుతున్న నిత్యానంద ఇప్పుడు కొత్త కరెన్సీతో సంచలనం రేపేలా కనిపిస్తన్నారు. ఈ కరెన్సీని చెలామణీలోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కైలాస దేశంలో ప్రపంచ కరెన్సీలన్నీ చెల్లుబాటు అయ్యేలా రూల్స్ తీసుకొస్తున్నారు. అలాగే తన కరెన్సీని కూడా ప్రపంచ దేశాలన్నీ ఆమోదిస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్ధానికంగా ఉండే బ్యాంకులు కూడా తన రిజర్వుబ్యాంకుతో ఒప్పందాలకు సిద్దమవుతున్నట్లు నిత్యానంద చెప్పుకుంటున్నారు. దీంతో ఈసారి నిత్యానంద భారీ ఫైనాన్షియల్ ప్లానే వేసినట్లు తెలుస్తోంది.
అంతా ఫేక్ అంటున్న ఈక్వెడార్..
ఇప్పటికే కైలాస దేశం పేరుతో ఈక్వెడార్ పక్కనే ఉన్న దీవులను కొనుగోలు చేసి కొత్త కంట్రీని ప్రకటించిన స్వామి నిత్యానంద విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాల్లోనూ తన ప్రణాళికలను బయటపెట్టారు. ఇప్పుడు రిజర్వు బ్యాంకు పేరుతో బ్యాంకులకు ఒప్పందాలు చేసుకినేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఆయన ఎక్కడున్నారో మాత్రం తెలియడం లేదు. నిత్యానంద పేరుతో వస్తున్న ప్రకటనలు మినహా మిగతా సమాచారం ఏదీ ఎవరికీ అందుబాటులో లేదు. దీంతో ఈక్వెడార్ కూడా రిజర్వుబ్యాంకు వ్యవహారం అంతా ఒట్టిదే అని చెబుతోంది. గతంలో ప్రభుత్వం, శాఖలు అంటూ హడావిడి చేసిన నిత్యానంద అసలు తమ దేశంలో కానీ, చుట్టు పక్కల కానీ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడం లేదని ఈక్వెడార్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరోసారి జనాన్ని బురిడీ కొట్టించేందుకు నిత్యానద మరో ప్లాన్ సిద్ధం చేసినట్లు అర్ధమవుతోంది.