ఆమె రాత్రి అక్కడెందుకుండాలి: గ్యాంగ్ రేప్పై మంత్రి
బెంగళూరు: ఐటి రాజధాని బెంగళూరు నగరంలోని కబ్బన్ పార్క్ లో జరిగిన గ్యాంగ్ రేప్ విషయంపై స్పందించిన కర్ణాటక హోం శాఖ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఆమె అక్కడ ఎందుకు ఉందని అని ప్రశ్నించారు.
హోం శాఖ మంత్రి పరమేశ్వర ఓ ప్రయివేటు టీవీ చానెల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తుమకూరుకు చెందిన 33 ఏళ్ల మహిళ టెన్నిస్ శిక్షణ కోసం బెంగళూరు వచ్చిన సమయలో గ్యాంగ్ రేప్ జరగిందని, ఇలా జరగడం దురదృష్టకరం అన్నారు.
తాము అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని పరమేశ్వర చెప్పారు. అసలు ఆ సమయంలో ఆమె అక్కడ ఎందుకు ఉందో ఇప్పటికీ తమకు అర్థం కావడం లేదని పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు.
ఈ విషయంపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మండిపడ్డారు. కర్ణాటక హోం శాఖ మంత్రి పరమేశ్వర ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం వలన ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళుతాయని వెంటనే ఆయన రాజీనామా చెయ్యాలని మేనకా గాంధీ డిమాండ్ చేశారు.
పరమేశ్వర కు మంత్రి పదవి వద్దనుకుంటే ఆ స్థానం నుంచి తప్పుకోవాలని మేనకా గాంధీ సూచించారు. గత గురువారం తుమకూరుకు చెందిన మహిళపై కబ్బన్ పార్క్ లో ఇద్దరు సెక్యూరిటి గార్డులు గ్యాంగ్ రేప్ చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల 22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగిని మీద ఇద్దరు వ్యక్తులు కదులుతున్న వాహనంలో గ్యాంగ్ రేప్ చేసిన సందర్బంలో అప్పటి హోం శాఖ మంత్రి కే.జే. జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకరు, ఇద్దరు చేస్తే అది రేప్ అవుతుందని, అది గ్యాంగ్ రేప్ కాదని కామెంట్ చేసి ప్రజల దగ్గర చివాట్లు తిన్నారు.