ఆ ఫోన్ కాలే పట్టించింది.. శేఖర్ రెడ్డి-రామ్మోహన్ రావు కాల్ ట్రాప్!
తమిళనాడు దివంగత సీఎం జయలలిత కన్నుమూసిన మరుసటి రోజే శేఖర్ రెడ్డి కాల్స్ ను ఐటీ అధికారులు ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది.
చెన్నై: చెన్నైలో జరుగుతున్న వరుస ఐటీ దాడుల నేపథ్యంలో.. పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. నోట్ల రద్దు నేపథ్యంలో పలువురు బడాబాబులపై కన్నేసిన ఐటీ శాఖ పక్కా నిఘాతో తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు బండారం బయటపడేలా చేసినట్టు తెలుస్తోంది.
నోట్ల రద్దు తర్వాతి పరిణామాలను ముందుగానే పసిగట్టిన ఐటీ అధికారులు.. భారీ ఎత్తున పాత కరెన్సీ మార్పిడికి గురవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు పలువురు పెద్ద తలకాయల కదలికలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డిపై నిఘా పెట్టగా.. అదే ఉచ్చులో తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు కూడా చిక్కుకున్నారు.
జయలలిత మరణించిన మరుసటి రోజే:
తమిళనాడు దివంగత సీఎం జయలలిత కన్నుమూసిన మరుసటి రోజే శేఖర్ రెడ్డి కాల్స్ ను ఐటీ అధికారులు ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. శేఖర్ రెడ్డి-రామ్మోహన్ రావు మధ్య చాలాసేపు సెల్ ఫోన్ సంభాషణ కొనసాగినట్టుగా గుర్తించారు. తమ వద్దనున్న కోట్ల రూపాయలను ఎలా మార్పిడి చేసుకోవాలి? అన్న అంశంపై వీరిద్దరు చర్చించుకున్నారు.
బలమైన ఆధారం కోసం:
శేఖర్ రెడ్డి అక్రమార్జనను తొలుత బట్టబయలు చేసిన ఐటీ అధికారులు.. ఆయన్ను విచారించడంతో సీఎస్ రామ్మోహన్ రావు పేరు బయటకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్న అధికారి ఇంటిపై ఓ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దాడులు చేయడం సబబు కాదని అధికారులు తొలుత వెనక్కి తగ్గారు.
మరేదైనా బలమైన ఆధారం దొరికితే.. రామ్మోహన్ రావు ఇంటిపై దాడులు చేయవచ్చని అధికారులు భావించారు. ఈ క్రమంలో ఇసుక క్వారీల అనుమతిపై భారీ ఎత్తున రాయితీలకు రామ్మోహన్ రావు నుంచి సిఫారసులు వచ్చాయని పర్యావరణ అధికారులు స్పష్టం చేయడంతో.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటిని అధికారులు చేజిక్కించుకున్నారు.
శేఖర్ రెడ్డితో ఫోన్ సంభాషణలో ఆ ప్రస్తావన:
భారీ నగదు మార్పిడితో పాటు ఇసుక తదితర వ్యాపార లావాదేవీలతో సమకూరిన సొమ్ముపై శేఖర్ రెడ్డితో రామ్మోహన్ రావు గంటల కొద్ది ఫోన్ ద్వారా సంభాషించారు. ఓవైపు సీఎం మరణించి రాష్ట్రంలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. సీఎస్ రామ్మోహన్ రావు మాత్రం తన డబ్బును ఎలా కాపాడుకోవాలన్న ప్రయత్నాల్లోనే మునిగిపోయారు.
జయలలిత అంత్యక్రియల ఏర్పాట్లను సైతం పర్యవేక్షించకుండా సీఎస్ రామ్మోహన్ రావు వ్యవహరించిన తీరు ఐటీ అధికారుల్లో అనుమానాలను నింపింది. ఇదే విషయాన్ని ఓ ఐటీ అధికారి సైతం వెల్లడించారు.
రెండువారాల క్రితమే దాడులకు ప్లాన్:
వాస్తవానికి రెండువారాల కిందటే రామ్మోహన్ రావు వ్యవహారాన్ని ఐటీ అధికారులు బట్టబయలు చేసినా.. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంలో జాప్యం జరగడం వల్లే దాడులు ఆలస్యమయ్యాయని తెలుస్తోంది. రెండు వారాల క్రితమే దాడులు జరిగుంటే మరింత భారీ ఎత్తున ఆస్తులు, నగదు పట్టుబడేవని ఐటీ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
గురువారం నాటి దాడుల్లో:
గురువారం నాడు కూడా ఐదుచోట్ల ఐటీ అధికారులు తనిఖీలు జరిపారు.ఆయన కుటుంబీకులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ తనిఖీల్లో.. మొత్తం 15 కిలోల బంగారం, రూ.24 లక్షల నగదు, కీలక సమాచారం తెలిపే ల్యాప్టాప్, మూడు హార్డ్ డిస్కులు, పెనడ్రైవ్లు, మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అంగీకరించిన రామ్మోహనరావు తనయుడు:
లెక్కా పత్రం లేని రూ.17కోట్ల నగదు తన వద్ద ఉన్నట్టుగా మాజీ సీఎస్ రామ్మోహనరావు తనయుడు వివేక్ అంగీకరించారని ఐటీ అధికారులు తెలిపారు. ఆయన ఇంటినుంచి దాదాపు 10కేజీల బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివేక్ ఇంటితో పాటు స్థానిక కోడంబాక్కంలోని యునైటెడ్ ఇండియా కాలనీలో ఉన్న రిటైర్డ్ అటవీ శాఖాధికారి ఇంట్లోను అధికారులు తనిఖీలు నిర్వహించారు.