నిర్భయ గ్యాంగ్రేప్ కేసు: క్షమాభిక్ష కొట్టివేత: సాయంత్రానికి రాష్ట్రపతి భవన్కు.. !
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని వణికించిన పారామెడికల్ విద్యార్థిని నిర్భయ సామూహిక అత్యాచారానికి గురైన కేసులో నిందితుడైన ముఖేష్ కుమార్ సింగ్ క్షమాభిక్ష పిటీషన్ను ఢిల్లీ ప్రభుత్వం కొట్టి పారేసింది. తనకు క్షమాభిక్షను ప్రసాదించాలని కోరుతూ ముఖేష్ కుమార్ సింగ్ ఢిల్లీ ప్రభుత్వానికి పిటీషన్ను దాఖలు చేశాడు. అక్కడి ప్రభుత్వం దీన్ని లెప్టినెంట్ గవర్నర్కు పంపించింది. ఈ పిటీషన్పై ఎలాంటి పరిశీలన చేపట్టకుండానే ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కొట్టి వేశారు. క్షమాభిక్షను ప్రసాదించలేమని పేర్కొన్నారు.
నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ముఖేష్ కుమార్ సింగ్ ఉరిశిక్షను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అతనితో పాటు పవన్ కుమార్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మను ఈ నెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు తీహార్ కేంద్ర కారాగారంలో ఉరి తీయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి న్యాయపరంగా ఇప్పటికే దోషులు పలు ప్రయత్నాలు చేశారు. అవన్నీ వృధా అయ్యాయి.
తాజాగా- తన చివరి ప్రయత్నాల్లో భాగంగా ముఖేష్ కుమార్ సింగ్ క్షమాభిక్ష కోసం పిటీషన్ను దాఖలు చేశాడు. దీన్ని ఢిల్లీ గవర్నర్ తోసి పుచ్చారు. దీన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించారు. అక్కడి నుంచి ఈ పిటీషన్ గురువారం సాయంత్రానికి రాష్ట్రపతి భవన్కు చేరుకోనుంది. ప్రథమ పౌరుడి హోదాలో ఈ పిటీషన్పై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. క్షమాభిక్షను అమలు చేయడమా? లేదా దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా బదలాయించడమా అనేది ప్రస్తుతం రాష్ట్రపతి చేతుల్లో ఉంది.
క్షమాభిక్షకు సంబంధించిన ప్రతిపాదనలు గానీ, పిటీషన్లు గానీ ఏవీ ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో అపరిష్కృతంగా లేవు. ఇదే కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ ఇదివరకు రాష్ట్రపతికి క్షమాభిక్షకు అవసరమైన ప్రతిపాదనలను దాఖలు చేసినప్పటికీ.. దాన్ని వెనక్కి తీసుకున్నారు. నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో రాష్ట్రపతి భవన్కు చేరిన తొలి క్షమాభిక్ష ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.