ఆర్ కే నగర్ లో నేనే గెలుస్తా, రాష్ట్ర రాజకీయాలు తారుమారు: దినకరన్ చాలెంజ్!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా తానే విజయం సాధిస్తానని, అమ్మకు నిజమైన వారసుడు తానే అని నిరూపించుకుంటానని టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశారు.
గురువారం ఆర్ కే నగర్ పోలింగ్ ముగిసిన తరువాత టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడారు. ఆర్ కే నగర్ లో దాదాపు 80 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని, నూటికి నూరు శాతం తాను విజయం సాధిస్తానని టీటీవీ దినకరన్ చెప్పారు.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తాను విజయం సాధించిన తరువాత తమిళనాడు రాజకీయాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, తన ఎన్నికల గుర్తు కుక్కర్ దెబ్బ ఏమిటీ చూపిస్తానని పరోక్షంగా ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని టీటీవీ దినకరన్ హెచ్చరించారు.
అయితే ఎన్నికల నియమాలు ఉల్లంఘించి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో విడుదల చేసిన విషయంపై పోలీసులు టీటీవీ దినకరన్, అనర్హత ఎమ్మెల్యే వెట్రివేల్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.