మరో ఉగ్ర ఘాతుకం: పోలీసును కిడ్నాప్ చేసి, కాల్చి చంపేశారు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. జావేద్ అహ్మద్ అనే పోలీస్ కానిస్టేబుల్ను గురువారం రాత్రి షోపియాన్ జిల్లా నుంచి అపహరించుకుపోయిన ఉగ్రవాదులు.. ఆయనను తుపాకులతో కాల్చి దారుణంగా హత్యచేశారు.
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర మిశ్రాకు వ్యక్తిగత భద్రత కోసం నియమించిన జావేద్ను కచ్దూరా గ్రామంలోని ఆయన ఇంటి నుంచి గురువారం రాత్రి సాయుధులైన ఉగ్రవాదులు అపహరించి తీసుకెళ్లారని పోలీసులు వెల్లడించారు.
ఉగ్రవాదులు జావేద్ను తలలో కాల్చి చంపేశారని పోలీసులు వెల్లడించారు. కుల్గాం జిల్లాలోని సెహ్పొరా ప్రాంతంలో రోడ్డు పక్కన ఆయన మృతదేహం లభించినట్లు తెలిపారు. కచ్దూరా గ్రామంలో ఈ ఏడాది ఏప్రిల్లో భద్రతాసిబ్బంది ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. అందుకు ప్రతీకారంగానే ముష్కరులు కానిస్టేబుల్ను అపహరించి చంపేసినట్లు తెలుస్తోంది.
కాగా, జూన్ నెలలో పుల్వామా జిల్లాలో ఔరంగజేబు అనే సైనికుడిని కూడా ఉగ్రవాదులు అపహరించి చంపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో ఘటనలో సీనియర్ జర్నలిస్ట్ షుజాత్ బుఖారీని హత్య చేశారు ఉగ్రవాదులు.