గొంతులోతు వరదనీరు.. టబ్లో పసిపాపను పడుకోబెట్టి ప్రాణాలు కాపాడిన పోలీసు..
వడోదర : పోలీసులంటే చాలా మందికి హడల్. కొందరు ఖాళీలు ప్రవర్తించే తీరు అందుకు కారణం. కానీ గుజరాత్లో మాత్రం ఓ పోలీసు మానవత్వాన్ని చాటుకున్నాడు. వరదలో చిక్కుకున్న బిడ్డను తలపై మోస్తూ గొంతులోతు నీళ్లలో నడిచి ప్రాణాలు కాపాడాడు. అతను చేసిన సాహసానికి ప్రతి ఒక్కరూ సలాం కొడుతున్నారు.
జలమయమైన లోతట్టు ప్రాంతాలు
గుజరాత్లోని వడోదరను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులువంకలు పొంగిపొర్లు తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఐదడుగుల మేర నీరు చేరడంతో అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. విశ్వామిత్రి రేల్వే స్టేషన్ సమీపంలోని దేవిపురాలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. భారీగా వరద నీరు చేరడంతో అక్కడి జనం బయటకు వేళ్లే దారిలేకుండా పోయింది. దాదాపు ఐదు అడుగుల మేర నీరు చేరడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీశారు.
వరద నీటిలో చిక్కుకున్న పసిబిడ్డ
దేవీపురాలో నెలకొన్న పరిస్థితి గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తాడును ఒకవైపు నుంచి మరోవైపునకు కట్టి జనాన్ని పట్టుకుని వరద నీటిని దాటించారు. ఇంతలో ఓ ఇంట్లో ఓ మహిళ బిక్కుబిక్కుమంటూ ఉన్న దృశ్యం ఎస్ఐ గోవింద్ చావ్డా కంటపడింది. ఆమె వద్దకు వెళ్లిన ఎస్ఐ ఎందుకు బయటకురావడంలేదని ప్రశ్నించగా.. అక్కడ పడుకుని ఉన్న పసిపాపను చూపించింది. దాదాపు ఏడాదిన్నర వయసున్న చిన్నారిని వరద నీటి నుంచి ఎలా దాటించాలో తెలియక ఆ తల్లి ఆందోళన చెందుతోంది. దీంతో వెంటనే గోవింద్కు ఓ ఉపాయం తట్టింది.
బిడ్డను తలపై ఎత్తుకుని పీకల్లోతు నీళ్లలో నడుస్తూ
సదరు మహిళను అడిగి ఓ ప్లాస్టిక్ టబ్ తీసుకున్న ఎస్ఐ గోవింద్ అందులో కొన్ని బట్టలతో పాటు బెడ్ షీట్ను పరిచాడు. అందులో పాపను పడుకోబెట్టి దాన్ని తలపై పెట్టుకున్నారు. తాడు సాయంతో పీకల్లోతు నీళ్లలో దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ దూరం వరకు జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ తల్లీ బిడ్డల్ని సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. బిడ్డను తల్లికి అప్పగించాడు. తనతో పాటు బిడ్డను సహాయకశిబిరానికి చేర్చిన గోవింద్ చావ్డాకు సదరు మహిళ కృతజ్ఞతలు చెప్పింది. గొంతు వరకు నీళ్లలో మునిగి పసిపాపను రక్షించిన ఎస్ఐను పనిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.