సెంట్రల్ జైల్లో ఉగ్రవాదులకు స్మార్ట్ ఫోన్లు స్మగ్లింగ్, బెంగళూరు పోలీసు అరెస్టు, రూ. 5 వేల కోసం !
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉగ్రవాదులకు సహాయం చెయ్యడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉగ్రవాదులకు సహాయం చెయ్యడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బెంగళూరు సిటీ రిజర్వు ఫోర్స్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న దినేష్ అనే వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
కా నిస్టేబుల్ దినేష్ నుంచి రెండు స్యామ్ సంగ్ J2 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 2008లో బెంగళూరు నగరంలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వరుస బాంబు పేలుళ్లకు కారణం అయిన ఉగ్రవాది టీ. నాసిర్ ను అరెస్టు చేశారు.
సమన్లు ఇచ్చారు
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో నాసిర్ శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రత్యేక కోర్టులో బెంగళూరు వరుస బాంబు పేలుళ్లు కేసు విచారణలో ఉంది. కేసు విచారణలో భాగంగా నాసిర్ కు సమన్లు అంధించాలని కోర్టు సూచించింది. ఉగ్రవాది నాసిర్ కు సమన్లు అందించే బాధ్యతను కానిస్టేబుల్ దినేష్ కు అప్పగించారు.
అనుమానం వచ్చింది
గురువారం బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు దగ్గరకు దినేష్ సమన్లు ఉన్న కవర్ తీసుకెళ్లాడు. ఉగ్రవాది నాసిర్ కు కవర్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సిబ్బందికి కవర్ చూసిన వెంటనే అనుమానం వచ్చింది.
రెండు స్మార్ట్ ఫోన్లు
సమన్లు ఉన్న కవర్ తీసి చూపించాలని జైళ్ల శాఖ సిబ్బంది దినేష్ కు సూచించారు. కవర్ ఓపెన్ చెయ్యడానికి దినేష్ నిరాకరించడంతో దానిని సిబ్బంది స్వాధీనం చేసుకుని పరిశీలించారు. సమన్లు ఉన్న కవర్ లో రెండు స్యామ్ సంగ్ J2 స్మార్ట్ ఫోన్లు ఉన్న విషయం గుర్తించి వెంటనే దినేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
రూ. 5 వేలు డీలింగ్
రెండు స్యామ్ సంగ్ J2 స్మార్ట్ ఫోన్లు అందిస్తే రూ. 5 వేలు లంచం ఇస్తానని ఉగ్రవాది నాసిర్ దినేష్ కు చెప్పాడని, అందుకే అతనికి రెండు ఫోన్లు అందించడానికి కానిస్టేబుల్ దినేష్ అంగీకరించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దినేష్ ను పరప్పన అగ్రహార పోలీసులకు అప్పగించారు.
ఉగ్రవాదులతో లింక్ ?
ప్రత్యేక బృందం పోలీసు అధికారులు కానిస్టేబుల్ దినేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నాసిర్ కాకుండా మరెవరైనా ఉగ్రవాదులతో దినేష్ కు సంబంధం ఉందా ? అని ఆరా తీస్తున్నారు. ఉగ్రవాది నాసిర్ కు మొబైల్ ఫోన్లు చేరి ఉంటే అతను జైల్లో నుంచే ఉగ్రవాద చర్యలకు పాల్పడే అవకాశం ఉండేదని పోలీసు అధికారులు అంటున్నారు.