అర్నబ్ను విచారించిన పోలీసుకు కరోనా.. కేసు సీబీఐకి..? సుప్రీంలో వాడి వేడి వాదనలు..
ప్రముఖ టీవీ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామిని విచారిస్తున్న పోలీస్ అధికారుల్లో ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయినట్టు ఆయన తరుపు న్యాయవాది హరీశ్ సాల్వే తెలిపారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఇద్దరు హిందూ సాధువుల మూక హత్య నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి తన టీవీ షోలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వివాదంపై పలు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఎఫ్ఐఆర్ల ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతూ అర్నబ్ సుప్రీంను ఆశ్రయించారు.
12గంటల పాటు అర్నబ్ విచారణ.. ఆ పోలీసుకి కరోనా..
టీవీ చానెల్లో ప్రసారమైన డిబేట్పై నమోదైన ఎఫ్ఐఆర్పై పోలీసులు విచారణ జరిపారని హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఏప్రిల్ 28న అర్నబ్ గోస్వామిని 12గంటల పాటు విచారించారని చెప్పారు. లాక్ డౌన్ పీరియడ్లోనే ఈ విచారణ జరిగిందని.. విచారణ జరిపిన ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్గా తేలిందని చెప్పారు. నిజానికి పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపి ఉండాల్సిందని వాదించారు.
సీబీఐ అప్పగించాలని ప్రతిపాదన.. కపిల్ సిబల్ కౌంటర్
విచారణ సందర్భంగా సాల్వే ఆర్టికల్19(1)(a)తో పాటు మీడియా స్వేచ్చ గురించి ప్రస్తావించారు. ఒకవేళ మతతత్వానికి సంబంధించిన కామెంట్స్ చేస్తే పోలీసులు ఎటువంటి నిర్దారణ లేకుండా దానిపై ఎలా ఒక అంచనాకు వస్తారని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు మీడియా స్వేచ్చకు విఘాతం కలిగిస్తాయని చెప్పారు. అంతేకాదు,పాల్ఘర్ వివాదానికి సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించినా తమకేమీ అభ్యంతరం లేదన్నారు. మధ్యలో జోక్యం చేసుకున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐకి కేసును అప్పగిస్తే.. అప్పుడది వారి చేతుల్లోకే వెళ్తుందని వ్యాఖ్యానించారు. సిబల్ వ్యాఖ్యలపై సొలిసిటర్ తుషార్ మెహ్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
విచారణ తప్పుదోవ పడుతోందని ఆరోపణలు
సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యల విచారణకు అర్నబ్ ఎడిటోరియల్ టీమ్ గురించి,కంటెంట్ గురించి అడగాల్సిన అవసరమేంటని సాల్వే ప్రశ్నించారు. అంతేకాదు, టీవీ చానెల్లో ఎవరు పెట్టుబడులు పెట్టారని పదేపదే ప్రశ్నించారన్నారు. ఇదే కేసుకు సంబంధించి సీఈవోను ఆరు గంటల పాటు విచారించారని.. న్యూస్ టెలికాస్ట్తో ఆయనకేమీ సంబంధమని ప్రశ్నించారు. కంపెనీ ఎవరు పెట్టారు..? అసలు యజమాని ఎవరు..? ఇలాంటి ప్రశ్నల ద్వారా పోలీసులు ఏమి రాబట్టాలనుకుంటున్నారని నిలదీశారు.
కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా మారిపోయిందని..
టీవీ చానెల్ డిబేట్స్లో పాల్గొనే అతిథుల లిస్టును ఎవరు డిసైడ్ చేస్తారు.. న్యూస్ని సేకరించే ప్రొసీజర్ ఎలా జరుగుతోంది.. ఇతరత్రా ఆర్థిక వివరాలు.. ఇవన్నీ ముంబై పోలీసులు అడుగుతున్నారని సాల్వే కోర్టుకు తెలిపారు. విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే ముంబై పోలీసుల మైండ్ సెట్ ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. విచారణ సక్రమంగా జరగట్లేదని ఆరోపించారు. అంతేకాదు, ఈ కేసు కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా మారిపోయిందని.. మధ్యలో తానున్నానని చెప్పారు.కేసును సీబీఐకి అప్పగించి పారదర్శకంగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
Recommended Video
వచ్చే వారం తేల్చనున్న కోర్టు
అర్నబ్ గోస్వామి పూర్తిగా మత కల్లోలాలను సృష్టించడానికే పూనుకున్నాడని ఆరోపించారు. ఇకనైనా మతతత్వ వ్యాఖ్యలను ఆపాలని,కాస్త నైతికతను,డీసెన్సీని అలవరుచుకోవాలని సూచించారు. కొన్ని సంఘటనలు సంచలనాత్మకంగా మార్చి ప్రజల్లో బేధాభిప్రాయాలు సృష్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా.. ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. అయితే దానిపై ఈ వారం తర్వాత నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.