బీజేపీ కార్పొరేటర్ భార్య హోటల్లో ‘సెక్స్ రాకెట్’!
ఓ బీజేపీ కార్పొరేటర్ భార్య నడుపుతున్న హోటల్లో సెక్స్ రాకెట్ బట్టబయలు కావడం సంచలనం సృష్టించింది. మహారాష్ట్రలోని తూర్పు కల్యాణ్ లో ఉన్న రిలాక్స్ హోటల్ అండ్ గార్డెన్ లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
కల్యాణ్: ఓ బీజేపీ కార్పొరేటర్ భార్య నడుపుతున్న హోటల్లో సెక్స్ రాకెట్ బట్టబయలు కావడం సంచలనం సృష్టించింది. మహారాష్ట్రలోని తూర్పు కల్యాణ్ లో ఉన్న రిలాక్స్ హోటల్ అండ్ గార్డెన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... బీజేపీ కార్పొరేటర్ నితిన్ పాటిల్ భార్య రంజనా పాటిల్ ఈ హోటల్ యజమాని. సెక్స్ రాకెట్ నడుస్తోందన్న సమాచారం మేరకు బుధవారం థానే పోలీసులు ఈ హోటల్ పై రైడ్ చేశారు.
ఈ ఘటనలో పోలీసులు ఓ బంగ్లాదేశ్ యువతితో సహా నలుగురు అమ్మాయిలను, ఆరుగురు హోటల్ సిబ్బందిని అరెస్టు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బార్ మేనేజర్ హరిశ్చంద్ర శెట్టి, క్యాషియర్ రాహుల్ దత్, వెయిటర్లు సత్యనారాయణ పాల్, రమాకాంత్ మహంత్, విజయ్ శెట్టి, విజ్ఞాన్ శ్యామల్ ఉన్నారు.
థానే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ కు చెందిన సీనియర్ పోలీసు అధికారి రవీంద్ర దండేకర్ మాట్లాడుతూ.. రిలాక్స్ హోటల్ అండ్ గార్డెన్ లో సెక్స్ రాకెట్ నడుస్తోందన్న సమాచారం అందగానే ఓ పోలీసు అధికారిని విటుడి వేషంలో పంపించినట్లు చెప్పారు.
అతడు ఆ హోటల్ లోని బార్ లోపలికి వెళ్లి తనకు ఓ అమ్మాయి కావాలని అడగ్గా, హోటల్ సిబ్బంది ఓ అమ్మాయిని పిలిపించి హోటల్ లోనే ఉన్న ఓ గదిలోకి పంపించారని, దీంతో అతడు వెంటనే పోలీసులను అలర్ట్ చేయగా తాము సిబ్బందితో ఆ హోటల్ పై రైడింగ్ చేశామని చెప్పారు.
రిలాక్స్ హోటల్ అండ్ గార్డెన్ లో సెక్స్ రాకెట్ బట్టబయలైన వ్యవహారంపై ఆ హోటల్ యజమాని, బీజేపీ కార్పొరేటర్ నితిన్ పాటిల్ భార్య రంజనా పాటిల్ ను కూడా విచారిస్తామని సదరు సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు.
ఈ ఘటనపై రంజనా పాటిల్ భర్త, స్థానిక బీజేపీ కార్పొరేటర్ నితిన్ పాటిల్ స్పందించారు. రిలాక్స్ హోటల్ అండ్ గార్డెన్ తన భార్య నడిపించడం లేదని స్పష్టం చేశారు.
తాము ఆ భవనాన్ని హోటల్ యజమానికి అద్దెకు ఇచ్చామని, ఆ హోటల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకున్నా అందుకు బాధ్యులు హోటల్ యజమానులే తప్ప.. భవన యజమాని అయిన తన భార్య కాదన్నారు.
ఈ మేరకు తాము ముందుగానే హోటల్ యజమానితో ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నామని, ఈ సెక్స్ రాకెట్ ఘటనలో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.