ఉద్రిక్తతకు దారితీసిన జేఎన్యూ విద్యార్థుల నిరసన.. స్టూడెంట్స్ అరెస్ట్, విడుదల
పెంచిన హాస్టల్ ఫీజు తగ్గించాలని, ఇతర డిమాండ్లతో ఢిల్లీ గల్లీలో జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీ విద్యార్థులు చేపటటిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. చేతిలో ప్ల కార్డు పట్టుకొని పార్లమెంట్ ముట్టడికి బయల్దేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. సప్దర్గంజ్ సమాధి వద్ద విద్యార్థులను పోలీసులు నిలువరించారు. దీంతో అక్కడే విద్యార్థులు నిరసన చేపట్టారు. భారీగా పోలీసులు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది.
అడ్డుకున్న పోలీసులు
విద్యార్థుల ఆందోళనలో జేఎన్యూ విద్యార్థి సంఘ నేతలు పాల్గొన్నారు. వేలాదిమంది విద్యార్థులు తరలిరాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే జేఎన్యూ చీఫ్ను అరెస్ట్ చేయడంతో విద్యార్థులు నినాదాలు చేశారు. తొలుత అరెస్ట్ చేశామని, తర్వాత లేదని చెప్పి.. చివరికి వదిలిపెట్టడంతో హైడ్రామాకు తెరపడింది. అయితే జేఎన్యూ అధికారులు మానవ వనరుల శాఖ కార్యదర్శిని కలిసేందుకు విఫలయత్నం చేశారు. విద్యార్థుల మాటున వెళదామని ప్రయత్నిస్తే పోలీసులు స్టూడెంట్స్ను ఛేజ్ చేసి మరీ.. అధికారులను అడ్డుకున్నారు.
ట్రాఫిక్కు అంతరాయం
సర్దర్ గంజ్ సమాధి వద్ద నుంచి విద్యార్థులను తరలించేందుక పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది ముఖ్య కూడలి కావడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతున్నందున చర్యలు తీసుకుంటున్నారు. కానీ విద్యార్థులు వినకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోతోంది. మరోవైపు ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనతో కొన్నిచోట్ల మెట్రో రైళ్లు కూడా నిలిచిపోయాయి.
సద్దుమణిగిన గొడవ
సర్దార్ గంజ్ సమాధి వద్ద వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిని వదిలిపెట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.
సహకరించండి
విద్యార్థులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని పోలీసులు సూచించారు. నిరసనను శాంతియుతంగా చేపట్టాలని కోరారు. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే శాంతి భద్రతల దృష్ట్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు.