హెల్మెట్ లేదని పోలీసుల ఫైన్.. కోపంతో స్టేషన్ కరెంటు కట్ చేసిన లైన్మెన్
ఫిరోజాబాద్ : ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించడం సర్వసాధారణం. అయితే ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు ప్రవర్తించే తీరు విమర్శలకు తావిస్తోంది. యూపీలో హెల్మెట్ పెట్టుకోలేదంటూ ఓ చిరుద్యోగి ఫైన్ విధించిన పోలీసులు ఎంత బతిమాలినా కనికరించలేదు. దీంతో జరిమానా కట్టిన సదరు వ్యక్తి ఆ తర్వాత పోలీసులకు చుక్కలు చూపించాడు. ఐదు గంటల పాటు చిమ్మచీకట్లో ఇబ్బందులు పడేలా చేశాడు.
రూ.500ఫైన్ వేసిన పోలీసులు
ఉత్తర్ప్రదేశ్ ఫిరోజాబాద్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. మంగళవారం పని నిమిత్తం వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపారు. హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంతో రూ.500 ఫైన్ వేశారు. అయితే తన జీతం రూ.6000 మాత్రమేనని, అంతమొత్తం జరిమానా చెల్లించలేనని చెప్పాడు. ఫైన్ తగ్గించమని పోలీసులను అభ్యర్థించాడు. అయితే అందుకు నిరాకరించిన పోలీసులు రూ.500 చెల్లిస్తేనే వాహనాన్ని విడిచిపెడతామని చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో శ్రీనివాస్ ఆ మొత్తం చెల్లించాడు.
పోలీస్ స్టేషన్ బకాయి రూ.6లక్షలు
పోలీసులను అంతగా బతిమాలినా కనికరించకపోవడంతో శ్రీనివాస్లో కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తోటి సిబ్బందికి ఫోన్ చేసి లైన్ పార్ పోలీస్ స్టేషన్ కరెంటు బిల్లు బకాయిల గురించి ఆరా తీశాడు. సదరు పోలీస్ స్టేషన్కు సంబంధించి రూ.6,62,463 బకాయి ఉందని సదరు వ్యక్తి చెప్పాడు. 2016 జనవరి నుంచి బిల్లు కట్టలేదని స్పష్టం చేశాడు. ఇదే ఛాన్సు అనుకుని శ్రీనివాస్ వెంటనే పోల్ ఎక్కాడు. లైన్ పార్ పోలీస్ స్టేషన్కు కరెంటు కట్ చేశాడు.
లైన్మెన్పై అధికారులకు ఫిర్యాదు
లైన్ మెన్ కరెంట్ కట్ చేసిన విషయం తెలియని పోలీసులు తొలుత పవర్ కట్ అని భావించారు. దాదాపు ఐదు గంటల గడిచినా కరెంటు రాకపోవడంతో అససలుు విషయం తెలుసుకున్నారు. విషయాన్ని విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బకాయి ఉన్న విషయాన్ని చెప్పడంతో స్టేషన్ హౌస్ ఇంఛార్జ్ ఆ మొత్తాన్ని చెల్లించడంతో కరెంటు పునరుద్ధరించారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా లైన్ మెన్ శ్రీనివాస్ కరెంట్ సరఫరా నిలిపివేయడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పోలీసులు అంటున్నారు.