బాధితుడితో షూ పాలిష్ చేయించిన పోలీసులు
ముజఫర్ నగర్: పోలీసులు తలచుకుంటే ఏమైనా చేస్తారని మరో సారి వెలుగు చూసింది. తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వ్యక్తితో అమానుషంగా ప్రవర్తించారు. వయస్సులో పెద్దవాడు అనికూడా చూడకుండా ఆయనతో చెయ్యరాని పని చేయించారు.
పోలీసుల శాడిజం ఎలా ఉంటుందో ఉత్తరప్రదేశ్ పోలీసులు మరో సారి చూపించారు. ముజఫర్ నగర్ జిల్లా ఎస్ పీ సంతోష్ కుమార్ కథనం మేరకువివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ బాధితుడు తనకు న్యాయం చెయ్యాలని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అతని ఆవేదన వింటూ తమాషా చేశారు.
తరువాత నీకు న్యాయం చెయ్యాలన్నా, కేసు నమోదు చెయ్యాలన్నా మేము చెప్పిన పని చెయ్యాలని అక్కడ ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ చెప్పాడు. సరే సార్ మీరు చెప్పినట్లు చేస్తానని బాధితుడు అంగీకరించాడు. అంతే ఆ పోలీసు చేర్ మీద కుర్చుని తన రెండు కాళ్లను బాధితుడి దగ్గరకు జరిపాడు.
నా షూ పాలిష్ చెయ్యి అంటూ ఆదేశాలు జారీ చేశాడు. చేసేది ఏమీ లేక బాధితుడు షూ పాలిష్ చేశాడు. అంతే పోలీస్ స్టేషన్ ఉన్న చాల మంది అతని దగ్గర షూ పాలిష్ చేయించుకున్నారు. బాధితుడు షూ పాలిష్ చేసే సమయంలో మొబైల్ లో వీడియో తీసిన ఓ వ్యక్తి దానిని తీసుకు వెళ్లి సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద దూమరం రేగింది. ఈ విషయం పై ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తున్నామని ముజఫర్ నగర్ జిల్లా ఎస్ పీ సంతోష్ కుమార్ తెలిపారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితుడికి న్యాయం చేస్తామని ఆయన అన్నారు.