lockdown continue: సొంతూళ్లకు వెళ్లేందుకు వలసకూలీలు బారులు, పోలీసుల లాఠీఛార్జీ..
కరోనా వైరస్ను సమూలంగా నిర్మూలించేందుకు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ పొడిగించింది. మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ఉంటుందని, అయితే ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఆంక్షలపై సడలింపు ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీంతో దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉన్న వలసకూలీలు.. ఏప్రిల్ 14వ తేదీన తర్వాత లాక్డౌన్ ఎత్తివేస్తారని అనుకొన్నారు. కానీ పొడిగించడంతో.. మహానగరంలో పని లేక, తినడానికి తిండిలేక సొంతూళ్ల బాట పట్టారు. దీంతో బాంద్రా పశ్చిమ రైల్వేస్టేషన్ వేల సంఖ్య కార్మికులతో నిండిపోయింది.
ఉత్తరప్రదేశ్, బీహర్, పశ్చిమ బెంగాల్కు చెందిన వలసకూలీలు మంగళవారం రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ముంబైలో కూడా పాజిటివ్ కేసులు ఎక్కువే.. ఈ క్రమంలో వేలాదిమంది వలసకూలీలు రైల్వేస్టేషన్ వద్ద గుమిగూడి ఉండటం ఆందోళన నెలకొంది. అక్కడికి చేరుకొన్న పోలీసులు కూలీలను వెళ్లిపోవాలని కోరారు. వినకపోవడంతో.. లాఠీచార్జీ చేశారు.
వలసకూలీల సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించలేదని మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. వారి సమస్యపై దృష్టిసారిస్తే.. ఇప్పుడు వారి గుమిగూడి ఉండేవారు కాదన్నారు. సమస్యకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే పేర్కొన్నారు. కేంద్రమే బాధ్యత వహించాలని ఆయన ట్వీట్ చేశారు.
మరో మంత్రి అస్లాం షేక్ కూడా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇదివరకు వలసకూలీలకు ఆహారం, నిత్యావసర వస్తువులు అందజేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారని గుర్తుచేశారు. కానీ ఇవ్వలేదని చెప్పారు. వలసకూలీలు ఇక్కడే ఉండాలని, సదుపాయాలు కల్పిస్తామని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కోరారు. కానీ కూలీలు మాత్రం రైల్వేస్టేషన్ చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.