మహా కుదుపు.!మరో మంత్రికి కరోనా పాజిటీవ్.!ఆందోళనలో మహారాష్ట్ర మంత్రి వర్గం.!
ముంబాయి/హైదరాబాద్ : ఈ నగరానికి ఏమైయ్యింది..? అనే యాడ్ ఇప్పుడు మహారాష్ట్ర కు బాగా అతికినట్టు సరిపోతుంది. ఓపక్క తుపాను ముప్పు, మరో పక్క కరోనా విజృంభణతో పాటు రోజుకో మలుపు తిరుగుతున్న రాజకీయ సంక్షోభం.. అన్నీ కలిసి ముంబాయి నగరానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో పంజావిసురుతున్న కరోనా ఉదృతికి చాలా మంది పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా వ్యాప్తి కూడా జెట్టు స్పీడు వేగంతో వ్యాపిస్తుండడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన మొదలవుతోంది.
మహారాష్ట్రలో మరో మంత్రికి సోకిన కరోనా.. ఆందోళనలో ప్రభుత్వ యంత్రాంగం..
ఎంత కట్టడి చేసినా కరోనా వైరస్ ఎందుకు అదుపులోకి రావడం లేదని అదికార యంత్రాంగాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ కావడంతో దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లింది మహా సర్కార్. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో వైరస్ విలయతాండవం చేయడంతో పాటు సామాన్య ప్రజానికం నుండి ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవుల్లో ఉన్న నాయకులు కూడా దీని బారిన పడుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా బృహన్ ముంబాయి కార్పోరేషన్ అధికారులు ఇరవై నాలుగు గంటలూ శ్రమిస్తున్నా కరోనా అదుపుకాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది.
ఇప్పటికే ఇద్దరు మంత్రులకు కరోనా.. తాజాగా మరో మంత్రికి సోకిన వైరస్..
కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలోనే మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలివడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇప్పటికే ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, తాజాగా మరో మంత్రికి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. న్యాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండేకు కరోనా వైరస్ సోకింది. ఆయన వ్యక్తిగత సహాయకుడితో పాటు కొంతమంది ఉద్యోగులకు నిర్దారణ కావడంతో ఒక్కసారిగా మహా మంత్రి వర్గంలో కలవరం మొదలైంది. బుధవారం మంత్రాలయలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముండే పాల్గొన్నారు. ఈ సమావేశం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది.
కరోనా వ్యాప్తిలో దేశంలోనే మహా టాప్.. ఏం చేయాలో అర్ధం కాని పరిస్ధితులు..
దీంతో మంత్రివర్గంతో పాటు ఉన్నతాధికారుల్లో ఆందోళన మొదలైంది. కరోనా బారిన పడ్డ మూడో మంత్రి ధనుంజయ్ ముండే కాగా, అంతకుముందు గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్, పబ్లిక్ వర్క్స్ మంత్రి అశోక్ చవాన్కు కూడా కరోనా సోకింది. అయితే వీరిద్దరూ కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 97,648 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,590 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబైలోనే గురువారం 97 మంది కరోనాతో చనిపోయారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మరోసారి కట్టుదిట్లమైన ఆంక్షలు అమలుచేసే దిశగా మహా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
నిన్నటి వరకు తుపాను ముప్పు.. మరోపక్క కరోనా.. దిక్కుతోచని స్ధితిలో ఆర్థిక నగరం..
నిన్నటి వరకూ తుపాను ముప్పు పొంచి ఉందని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపిన మహా ప్రజలు ఇప్పుడు కరోనా విజృంభణ పట్ల బెంబేలెత్తి పోతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ కరోనా కట్టడికోసం తీసుకునే చర్యల గురించి అప్రమత్తం చేసే మంత్రులకే కరోనా వైరస్ సోకుతుండడం పట్ల సామాన్య ప్రజానికం మనో వేధనకు గురౌతున్నట్టు తెలుస్తోంది. ఈ ముంబాయి మహా నగరానికి ఏమయ్యింది అనే దిశగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎండాకాలం కరోనా వ్యాప్తికి అనుకూలం కకాపోడంతో వైరస్ ను జయించొచ్చు అనుకున్న ముంబాయి వాసులకు వానా కాలం పిడుగులాంటి వార్తను మోసుకొచ్చింది. వర్షాకాలంలో కరోనా మరింత విజృంభిస్తుందనే వార్తలు మహా ప్రజానికాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేస్తున్నట్టు తెలుస్తోంది.