ఆరు రోజుల్లోనే లక్షకు పైగా కేసులు.. 5.50 లక్షలకుచేరువగా కేసులతో.. భారత్ పై కరోనా పంజా
భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వైరస్ ను కట్టడి చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కత్తిమీద సాములా మారింది. ఒక రకంగా చెప్పాలంటే కరోనా విషయంలో భారతదేశం చేతులెత్తేసినట్లుగానే తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఇప్పటికే కేసుల పెరుగుదలతో మణిపూర్ లాక్ డౌన్ ను పొడిగించింది. మహారాష్ట్ర మరియు తెలంగాణ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
Recommended Video
బ్రేకింగ్ ... తెలంగాణా హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్... అపోలోలో చికిత్స
ఒక్క ఆరు రోజుల్లోనే లక్షకు పైగా కేసులు
కరోనా కేసుల పెరుగుదల చూస్తే తప్పక షాక్ అవుతారు. ఒక్క ఆరు రోజుల్లోనే లక్షకు పైగా కేసులు నమోదైన పరిస్థితి తాజాగా ఇండియా లో కనిపిస్తోంది. కరోనా వైరస్ ప్రారంభదశలో లక్ష కేసులు నమోదు కావడానికి 109 రోజుల సమయం పడితే, ఇప్పుడు ఆరు రోజుల్లోనే లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి అంటే కరోనా కంట్రోల్లో మన ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పక తప్పదు. ఇక ఈ పరిణామాలు అత్యంత ఆందోళనకరం .
24 గంటల్లో 19700 మందికి కరోనా పాజిటివ్
అధికారికంగా చెప్పిన లెక్క లే కాకుండా, అనధికారికంగా కూడా ఇప్పటి ముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. మన దేశంలో గత 24 గంటల్లో 19700 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని చెప్పొచ్చు. ఇలా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితి ప్రస్తుతం విస్మయం కలిగిస్తోంది.
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ప్రస్తుతం 5,49,197
ఆసుపత్రులలో కరోనా పేషెంట్ లకు అందుతున్న వైద్యం లో కూడా అడుగడుగున లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. వారికి సరైన ఆరోగ్య రక్షణ అందడం లేదని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 384 మంది గత 24 గంటల్లో మృతిచెందారని అధికారికంగా విడుదల చేసిన జాబితాలో తేలింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ప్రస్తుతం చూసినట్లయితే 5,49,197 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 16,475 కి పెరిగింది.
టెన్షన్ లో ప్రభుత్వాలు .. రోజు రోజుకూ అధ్వానంగా ఇండియా పరిస్థితి
ఇప్పటివరకు 2,10,120 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 3.2 లక్షల మంది కరోనా నుండి కోలుకున్నట్లుగా తెలుస్తోంది . ఏదేమైనా కరోనా కేసులు పెరుగుతున్న తీరు మరొకసారి లాక్ డౌన్ పై ప్రజల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. ఇక కరోనాను కంట్రోల్ చేయలేకపోతున్న ప్రభుత్వాలు పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోలోపల టెన్షన్ పడుతున్నాయి. ఇదే స్థాయిలో కరోనా కేసులు పెరిగితే భారతదేశ పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.