భారత్ లో 57లక్షలు దాటిన కరోనా కేసులు .. గత 24 గంటల్లో 86,508 కొత్త కేసులు ,1,129 మరణాలు
ఇండియా లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది . ప్రతిరోజూ 80 వేల కేసులకు పైగా దేశంలో నమోదవుతున్న పరిస్థితి ఉంది.కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే సంతృప్తికరంగా ఉన్నా, కేసుల పెరుగుదల మాత్రం ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. అయినప్పటికీ కేసుల పెరుగుదల మాత్రం ఆగడం లేదు.
ఇండియాలో కరోనా దెబ్బ.. టాప్ 5 రాష్ట్రాలివే .. 90 వేలు దాటిన మృతుల సంఖ్య !!
భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 57,30,184
ప్రస్తుతం భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 57,30,184 కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 9,66,342 కాగా 46,71,850 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా 91,173 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో భారతదేశంలో 86,508 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు కరోనా వల్ల మొత్తం దేశంలో 1,129 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 87,374 గా ఉంది.
గడచిన 24 గంటల్లో 11,56 ,569 కరోనా నిర్ధారణ పరీక్షలు
దేశంలో 81.55 శాతం కరోనా నుండి కోలుకొని వారి రికవరీ రేటు ఉంటే, దేశం మొత్తంలో నమోదైన కరోనా కేసులలో కరోనా యాక్టివ్ కేసులు శాతం 16.86 గా ఉంది. మరణాల రేటు 1.59 శాతానికి తగ్గినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 11,56,569 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లుగా ఐసీఎమ్ఆర్ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 6 ,74,36,031 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లుగా తెలుస్తుంది.
24 గంటల్లో మహారాష్ట్రలోనే 21,029 కరోనా పాజిటివ్ కొత్త కేసులు
గడచిన 24 గంటల్లో ఒక మహారాష్ట్రలోనే 21,029 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయి అంటే మహారాష్ట్రలో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర సర్కారు ఎంత పెద్ద ఎత్తున కరోనా కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలించడం లేదు. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసులు చూస్తే 12,63,799 గా ఉంది. పూణే ,ముంబై , థానే నగరాలలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నిత్యం నమోదవుతున్నాయి. మరోపక్క ఇటీవల కాలంలో కురుస్తున్న భారీ వర్షాలు కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయి. అపరిశుభ్ర పరిసరాలు, అందరికీ వైద్యం అందించలేకపోవడం, మహారాష్ట్రలో ఎక్కువగా స్లమ్ ఏరియాలు ఉండడం కరోనా కంట్రోల్ కాకపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఏపీలో గత 24గంటల్లో 7,228 కొత్త కేసులు , తమిళనాడులో 5,325 కొత్త కేసులు
మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ,తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 7,228 కరోనా కొత్త కేసులు నమోదు కాగా , మొత్తం 6,46,530 కేసులు నమోదయినట్లుగా తెలుస్తుంది. మూడో స్థానంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలో గత 24 గంటల్లో 5,325 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 5,57,999 కేసులు నమోదైనట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
Recommended Video