మహారాష్ట్రలో మళ్లీ కరోనా హై.. పెరుగుతున్న కేసులు...
మహారాష్ట్రలో మళ్లీ కరోనా ఘంటికలు మోగుతున్నాయి. సెకండ్ వేవ్ నుంచి ఆ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇటీవలే కఠిన లాక్డౌన్ నుంచి ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. మార్కెట్లు రద్దీగా కనిపిస్తున్నాయి. దీంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడో వేవ్ తప్పదని.. అంచనాల కంటే ముందే మహమ్మారి మహారాష్ట్రను కుదిపేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
నిపుణులు చెప్పిన మాటలు నిజమేనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా రోజువారీ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. సోమవారం 6,270 కేసులు వెలుగులోకి రాగా.. మంగళవారానికి అవి 8,470కి పెరిగాయి. నేడు అవి 10,066కి ఎగబాకాయి. దీంతో మరోసారి రాష్ట్ర యంత్రాంగంలో ఆందోళన మొదలైంది. అన్లాక్ పేరిట నిబంధనలు సడలిస్తున్న కొద్దీ బహిరంగ ప్రదేశాల్లో రద్దీ పెరిగి కేసులు భారీ స్థాయిలో విజృంభించే అవకాశం ఉందని సీఎం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని కమిటీ ఇటీవలే హెచ్చరించింది. ఓ మ్యాథమేటికల్ మోడల్ ఆధారంగా చూస్తే రెండు వేవ్ల మధ్య 100-120 రోజుల వ్యవధి ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. అయితే కొత్తగా డెల్టా వేరియంట్ భయపెడుతుంది.
ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తీసుకునే అవకాశం ఉంది. నామమాత్ర రుసుం రూ.250 ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అందరికీ వ్యాక్సిన్ అందజేస్తే కరోనాను జయించడం తేలికే అవుతుంది.