జెట్ స్పీడ్ లో కరోనా కేసులు: ఇండియాలో రికార్డ్ స్థాయిలో 2 లక్షలను దాటిన కొత్త కేసులు, 1038 మరణాలు
భారతదేశంలో కరోనా దారుణ పరిస్థితికి చేరుకుంది . 2 లక్షలకు పైగా విపరీతంగా పెరిగిపోతున్న కేసులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో రెండు లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు కావడం అందరినీ టెన్షన్ పెడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 200,739 కరోనా కొత్త కేసులతో, రోజువారీ కేసు లో కొత్త రికార్డును సృష్టించింది భారత్. దీంతో భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14 మిలియన్ల మార్కును దాటింది.
10, 06,173 కరోనా యాక్టివ్ కేసులు
ఖచ్చితంగా చెప్పాలంటే ఇండియాలో 1,40,74,564 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి .ఇక కరోనా యాక్టివ్ కేసులు వివరాలు చూస్తే 10,06,173 కు భారీగా పెరిగాయి. తాజాగా గత 24 గంటల్లో 1,038 మంది మరణించడంతో, మొత్తం మరణాలు 1,73,123 కు పెరిగాయి. భారతదేశంలో 1.4 కోట్లకు పైగా కోవిడ్ కేసులతో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం భారతదేశం కరోనా విలయంలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది . కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న స్థితిలో యూఎస్ ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ఇండియా చేరింది.
తీవ్రంగా దెబ్బ తిన్న రాష్ట్రాలలో కరోనా కఠిన నిబంధనలు
ఢిల్లీ, హర్యానా మరియు గుజరాత్ లలో నైట్ కర్ఫ్యూ విధించగా, రోజువారీ కేసుల నమోదు లో రికార్డు బ్రేక్ చేస్తున్న మహారాష్ట్ర, రాత్రి కర్ఫ్యూ మరియు వారాంతపు లాక్డౌన్లను మాత్రమే పాటించడమే కాకుండా, ఐదుగురికి పైగా వ్యక్తుల సమావేశాన్ని నిషేధించే సెక్షన్ 144 కూడా అమలు చేస్తోంది . కోవిడ్ -19 మహమ్మారి సృష్టిస్తున్న విలయం నేపథ్యంలో, ప్రభుత్వం 10 వ తరగతికి చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) పరీక్షలను రద్దు చేయాలని బుధవారం నిర్ణయించింది . 12 వ తరగతి విద్యార్థుల పరీక్షలను వాయిదా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం జరిగిన తరువాత ఈ ప్రకటన చేశారు విద్యా మంత్రి రమేష్ పోఖ్రియాల్.
మహారాష్ట్రలో 58,952 తాజా కరోనావైరస్ కేసులు
కోవిడ్ -19 యొక్క సెకండ్ వేవ్ తీవ్రతరం కావడంతో, కరోనావైరస్ వ్యాక్సిన్ దేశ పౌరులు తీసుకోవాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. వరుసగా ఐదవ రోజు లక్షన్నర కేసులను దాటిన మహమ్మారి ఇప్పుడు రెండు లక్షలు దాటి ప్రయాణం సాగిస్తోంది. అత్యంత దారుణంగా దెబ్బతిన్న మహారాష్ట్ర మరియు రాజధాని ముంబైలో, రెస్టారెంట్లు మూసివేయబడ్డాయి .144 సెక్షన్ విధించి కరోనా కట్టడికి మహారాష్ట్ర సర్కారు తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో 58,952 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.
Recommended Video
ఏప్రిల్ 30 వరకు కుంభమేళా ... వేలాదిగా కరోనా కేసులు
మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,78,160 కు చేరుకోగా, 278 కొత్త మరణాలతో , మరణాల సంఖ్య 58,804 కు చేరుకున్నాయి.ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది . మహారాష్ట్ర తరువాత దక్షిణ రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా మతపరమైన సమావేశాలను తగ్గించలేమని, ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుందని అధికారులు చెప్పడంతో లక్షలాది మంది ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని కుంభమేళాకు తరలివచ్చారు. ఇక కుంభమేళా లోనూ వేలాదిగా కేసులు నమోదు అవుతున్నాయి .