భారత్ పై కరోనా పంజా: 18వేలను దాటిన కొత్తకేసులు; లక్ష దాటిన యాక్టివ్ కేసులు!!
భారతదేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతుంది. తాజాగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 18,819 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసులు గణనీయంగా పెరిగాయి. నిన్న 14వేలు దాటిన కరోనా కేసులు, నేడు 18వేలు దాటి కొనసాగటం ఆందోళన కలిగిస్తుంది. అలాగే గత 24 గంటల్లో 39 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.
పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు
గత 24 గంటల్లో 4.52 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివిటీ రేటు 4.16 శాతానికి చేరి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. ఈ స్థాయిలో రోజువారీ కేసులు నమోదు కావడం 130 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే కావడం గమనార్హం. తాజాగా నమోదైన కేసులలో ఒక్క కేరళ రాష్ట్రం లోనే 4,459 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 3,957 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ లో 1000 కేసులకు పైగా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది.
లక్ష మార్క్ దాటిన కరోనా క్రియాశీల కేసులు
గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి 13,827 మంది రోగులు కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య లక్ష మార్కును దాటి కొనసాగుతుంది. ప్రస్తుతం మొత్తం క్రియాశీల కేసులు 1,04,555 వద్ద ఉన్నాయి. తాజాగా నమోదైన 39 మరణాలతో కలిపి దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,25,116కి చేరింది. ఇదిలా ఉంటె దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. నిన్న 14.17 లక్షల మండి వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారు.
మళ్ళీ 110దేశాలలో గణనీయంగా పెరుగుతున్న కేసులు
కోవిడ్ -19 మహమ్మారి పరిణామం చెందుతుంది కానీ అది ముగియలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 110 దేశాలలో కేసులు పెరుగుతున్నాయని మరియు ప్రధానంగా రెండు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్ సబ్-వేరియంట్ల ద్వారా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ వారంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్ సబ్-వేరియంట్లు BA.4 మరియు BA.5 కలిసి యునైటెడ్ స్టేట్స్లో సగం కరోనావైరస్ కేసులను కలిగి ఉన్నాయని అంచనా వేసింది. జూన్ 25 నాటికి, యూఎస్ లోని మొత్తం కరోనావైరస్ కేసులలో BA.5 36.6 శాతంగా ఉండగా, BA.4 15.7 శాతంగా ఉంది.
కరోనా మార్గదర్శకాలను పాటించాలని కేంద్రం సూచన
భారతదేశంలో కోవిడ్ -19 కేసుల పెరుగుదలతో, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా దృష్టిసారించాలని, కరోనామార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. భారతదేశానికి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులపై కూడా దృష్టి పెట్టాలని పేర్కొంది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అన్ని సానుకూల నమూనాలను పంపాలని రాష్ట్రాలను కోరింది. నిర్లక్ష్యం మంచిది కాదని, గ్రూప్ సమావేశాలు, వేడుకలు, పండుగల విషయంలో అలెర్ట్ గా ఉండాలని పేర్కొన్నారు.