వణికిస్తున్న కరోనా..ఢిల్లీ ,కేరళ ,పశ్చిమబెంగాల్ లో జెట్ స్పీట్ లో కేసులు
దేశ రాజధాని ఢిల్లీ, కేరళ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కరోనా కొత్త కేసులలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా ఢిల్లీలో 104 మంది మరణించారు . ఒకే రోజులో కరోనా వైరస్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించడం ఢిల్లీ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. గత 24 గంటల్లో చూస్తే ఢిల్లీలో 7053 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం కరోనా కేసులు 4,67,028 లకు చేరుకుంది. ఇప్పటివరకు ఢిల్లీలో కరోనా బారిన పడి కరోనా నుండి కోలుకున్నవారు 4.16 లక్షల మంది . దేశ రాజధానిలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.71 శాతం కాగా, జాతీయ సగటు 3.8 శాతంగా ఉంది.
ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన
అక్టోబర్ 8 న నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇచ్చిన నివేదికలో శీతాకాలంలో ఢిల్లీలో 15 వేల వరకు కరోనావైరస్ కేసులు నమోదవుతాయని అంచనా వేసింది. కరోనావైరస్ మహమ్మారి మధ్య శీతాకాలం సమీపిస్తున్నందున నేషనల్ క్యాపిటల్ రీజియన్ లేదా ఎన్సిఆర్లో గాలి నాణ్యత కూడా పెద్ద ఆందోళన కలిగిస్తుంది . ఢిల్లీలో ప్రతిరోజూ వేలాది కరోనా కేసులను నివేదిస్తుంది. శీతాకాలంలో కాలుష్యం , గాలి నాణ్యత ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కరోనా వైరస్ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తున్న కారణంగా ఇతర అనారోగ్యాలు కలవారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని నిపుణులు అంటున్నారు .
కేరళ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా వైరస్ గ్రాఫ్ ... తీవ్ర సంకేతాలు
మరోపక్క కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ గ్రాఫ్ తీవ్ర సంకేతాలను చూపిస్తోంది. కేరళ రాష్ట్రంలోనూ కరోనా తగ్గినట్టే తగ్గి మరోసారి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేరళలో 5537 కరోనా కేసులు నమోదు కావడం కేరళ వాసులకు టెన్షన్ పెట్టిస్తోంది. కేరళ రాష్ట్రంలో తాజాగా 25 మరణాలు సంభవించాయి మృతి చెందిన వారి సంఖ్య 1796 గా ఉంది. కొత్త మరణాలలో, కోజికోడ్ ఐదు, పాలక్కాడ్, త్రిస్సూర్, ఎర్నాకుళం, అలప్పుజ మరియు తిరువనంతపురం మూడు మరణాలు, కొల్లం రెండు, కొట్టాయం, మలప్పురం మరియు కన్నూర్ ఒక్కొక్కరు మరణించారు. తాజాగా చలికాలం తీవ్రమవుతున్న సమయంలో కేరళలో కరోనా కేసులు పెరగడం కేరళ సర్కార్ కు తలనొప్పిగా మారింది.
Recommended Video
గత 24 గంటల్లో పశ్చిమబెంగాల్లో 3856 కరోనా కేసులు
కేరళ రాష్ట్రం తర్వాత కరోనా కేసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు చేసింది. గత 24 గంటల్లో పశ్చిమబెంగాల్లో 3856 కరోనా వైరస్ కేసులు నమోదు కావడం కేసులు పెరుగుదలను సూచిస్తోంది. శీతాకాలం ప్రారంభమైన నాటి నుండి దేశం లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ పరిణామాలు ఇలానే ఉంటే ముందు ముందు మరింత కరోనా వైరస్ విజృంభించే పరిస్థితి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు పాటించ వలసిన అవసరం ఉంది అంటున్నారు. మరొక పక్క వ్యాక్సిన్ కోసం పలు ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.