‘వచ్చే 2 నెలల్లో కరోనా విజృంభించే ఛాన్స్: లాక్ డౌన్ కొనసాగించాల్సిందే!’
న్యూఢిల్లీ: భారతదేశ వ్యాప్తంగా సుమారు 40 రోజులకుపైగా లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టడం లేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఈ నేపథ్యంలో రెడ్ జోన్లు, హాట్స్పాట్లు, వాటి పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ ను కొనసాగించాల్సిన ఆవశ్యకతపై ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Recommended Video
భారత్లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..
చైనా, ఇటలీలా..
ఇటలీ, చైనా లాంటి దేశాలు కరోనా కట్టడి కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నాయో వాటిని అమలు చేయాల్సి ఉందన్నారు. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని గులేరియా వ్యాఖ్యానించారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి చర్యల ద్వారానే ఆయా దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.
జూన్, జులైలో నెలల్లో..
భారతదేశంలో ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. జూన్, జులై నెలల్లో మరింతగా విజృంభించే అవకాశం ఉందని రణదీప్ గులేరియా అంచనా వేశారు. అయితే, కరోనా కేసులు ఎప్పుడు భారీగా పెరుగుతాయనేది తేల్చడం కొంత కష్టమేనని అన్నారు. అయితే, జూన్, జులై నెలల్లో కరోనా కేసులు భారీగా పెరిగేందుకు అవకాశం ఉందన్నారు.
మరింత కాలం లాక్డౌన్..
ఈ నేపథ్యంలోనే మరికొంత కాలం లాక్డౌన్ అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. జాగ్రత్తలు తీసుకుంటూనే కరోనాను కట్టడి చేయవచ్చునని అన్నారు. ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని గులేరియా స్పష్టం చేశారు.
ఎక్కువ పరీక్షలు చేయడం వల్లే..
పరీక్షలు ఎక్కువగా చేయడం వల్లే కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని డాక్టర్ గులేరియా తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరగకపోయినప్పటికీ.. తగ్గినట్లు మాత్రం కనిపించడం లేదని అన్నారు. హాట్ స్పాట్లు, రెడ్ జోన్లు, కంటైన్మెంట్లలో పరిస్థితులను ఎప్పటికప్పడు సమీక్షిస్తుండాలని అన్నారు.