coronavirus: ఇటలీ విమానాశ్రయంలో భారత విద్యార్థుల పడిగాపులు, వారిలో తెలుగువారే ఎక్కువ
హైదరాబాద్: చైనా తర్వాత కరోనావైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య ఇటలీలోనే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను స్వదేశానికి తీసుకెళ్లి కాపాడాలంటూ వీడియో సందేశాల ద్వారా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
Recommended Video
తెలుగు విద్యార్థుల ఇక్కట్లు..
అయితే, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉంటేనే.. వారు స్వదేవానికి వచ్చే అవకాశం ఉంది. ఆ సర్టిఫికేట్లు లేకపోవడంతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బొలొగ్న వర్సిటీలో 30 మందికిపైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు.వారికి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ ఇళ్లు దాటే పరిస్థితి లేకపోయింది.ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన బద్రీనాథ్ అనే విద్యార్థి తమ గోడును వెళ్లబోసుకున్నాడు.
తెలుగువారే ఎక్కువ..
ఇక పడోవా వర్సిటీలో 50 మందికిపైగా భారత విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ఏపీకి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. కొడొగ్నో నగరంలో మరో వంద మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. కాగా, రోమ్ విమానాశ్రయంలో మరింత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా వైరస్ సోకలేదని ధృవీకరణ పత్రం తెస్తేనే బోర్డింగ్ పాస్ ఇస్తామని విమానయాన సంస్థలు తేల్చి చెప్పడంతో వారు అక్కడే వేచిచూస్తున్నారు.
విమానాశ్రయంలో పడిగాపులు.. వేడుకోలు..
రెండ్రోజులుగా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యక్తికి కరోనా సోకడంతో విమానాశ్రయం ఖాళీ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమను భారత ప్రభుత్వం వెంటనే స్వదేశానికి తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. కాగా, ఇప్పటికే భారత ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వచ్చిన వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందు కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని పంపింనట్లు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.