కరోనా విలయం .. చిన్నారులు ఆహారం దొరక్క గడ్డి తింటున్న వైనం .. ఇండియాలోనే ఈ దారుణం
కరోనా విలయం కొనసాగుతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడు పట్టెడు అన్నం కూడా దొరకని పరిస్థితికి కారణం అవుతుంది. చాలా చోట్ల ఆకలి కేకలు అప్పుడే మొదలయ్యాయి. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరినీ భయపెడుతున్న ఈ మహమ్మారి ఇప్పుడు భయానక పరిస్థితులను తెచ్చి పెడుతుంది. అమెరికా లాంటి పెద్ద దేశమే కరోనా ధాటికి నరకం చూస్తుంటే ఇక మన దేశం పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు .
దినసరి కూలీల పరిస్థితి దారుణం
భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాప్తిని అరికట్టటానికి ముందు జాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీంతో రోజువారీ కూలీ పని చేసుకుని జీవనం సాగించే వారి పరిస్థితి దారుణంగా తయారైంది. లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవటంతో ఈ పరిస్థితి పేదలకు శాపంగా మారింది. పని దొరక్కపోవడంతో పిల్లలకు పట్టెడు అన్నం పెట్టలేని పరిస్థితి నెలకొంది .ప్రభుత్వం వీరి కోసం సహాయం అందిస్తామని చెప్పినా క్షేత్ర స్థాయిలో ఎప్పుడూ సహాయం అందిన దాఖలాలు లేవు .
తిండి లేక ఆకలిని తట్టుకోలేక కూలీల పిల్లలు గడ్డి తింటున్న వైనం
ఇక దీంతో ఈ సమయంలో కరోనా కంటే ఆకలి చావులే ఎక్కువ అయ్యేటట్టు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో దినసరి కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. పని లేకపోవడంతో కూలీలకు ఆదాయం లేకుండా పోయింది. దీంతో తిండి లేక ఆకలిని తట్టుకోలేక కూలీల పిల్లలు గడ్డి తింటున్న ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. ఈ ఫోటో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తుంది . ఇది చూసిన నెటిజన్లు కరోనా కన్నా ఆకలితోనే ఎక్కువ మంది చనిపోయేలా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Recommended Video
వలస కార్మికులకు తప్పని తిప్పలు .. పస్తులతో కూలీల బ్రతుకులు
ప్రభుత్వం నిరుపేదలకు సహాయం అందిస్తామని చెప్పినా అవి వివిధ రాష్ట్రాల నుండి పొట్ట కూటి కోసం వలస వచ్చిన వలస కార్మికులకు చేరవు. వారికి వారు జీవనం సాగించే రాష్ట్రాల్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటివి ఉంటేనే ప్రభుత్వ సాయం అందుతుంది. అలా కాకుండా కేవలం డబ్బు సంపాదన కోసం వచ్చిన వివిధ రాష్ట్రాల కూలీలు ప్రభుత్వ సాయం పొందలేక , ఆకలితో పస్తులు ఉండలేక నరకం అనుభవిస్తున్నారు. పిల్లలను సైతం పస్తులు పెట్టలేక బాధ పడుతున్నారు. సాయం చేసే నాధుడు లేదని వాపోతున్నారు. ఇలా వలస కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.