కరోనా ఎఫెక్ట్ ... అక్కడ ఏసీలకు బదులు ఫ్యాన్లు .. రీజన్ ఇదే !!
కరోనా వైరస్ ఇండియా మీద తన పంజా విసిరింది. ఇంకా కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితులలో లాక్ డౌన్ విధించి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో దేశ వ్యాప్తంగా కోర్టులు కూడా లాక్ డౌన్ అయ్యాయి. ఒక్క ఎమర్జెన్సీ కేసులు మినహాయించి మిగతా కేసుల విచారణ ఆన్ లైన్ లోనే సాగుతుంది . ఇక తాజాగా ఢిల్లీ హైకోర్టులో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు జడ్జీలతో కూడిన కమిటీ భేటీ అయ్యింది . కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
Recommended Video
లాక్ డౌన్ ఎత్తివేసినా సరే చాలా కాలం పాటు కరోనా ప్రభావం ఉంటుందని భావిస్తున్న నేపధ్యంలో లాక్ డౌన్ ఎత్తివేశాక ఢిల్లీ హైకోర్టు తిరిగి ప్రారంభిస్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చెయ్యాలి ? తీసుకోవాల్సిన చర్యలేంటి ? అన్న అంశాలపై జడ్జీలు చర్చించారు. కోర్టులో సెంట్రలైజ్డ్ ఎయిర్ కండీషనర్ల స్థానంలో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని జడ్జీలు నిర్ణయించారు. సెంట్రల్ ఏసీ యూనిట్ల ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని అందుకే కరోనా వైరస్ ను వ్యాప్తి చేసే ప్రమాదం ఉన్నందున కోర్టుల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని జడ్జీలు పీడబ్ల్యూడీ ఇంజినీర్లకు సూచించినట్టు తెలుస్తుంది.
ఇక ఒకవేళ సెంట్రల్ ఏసీ వాడితే కూడా కరోనా రాకుండా ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు . అందులో వైరస్ ను నివారించేందుకు వీలుగా అల్ట్రా వయోలెట్ జెర్మిసైడ్ ఎరాడికేషన్ డివైజ్ వాడితే ఎలా ఉంటుందనే విషయంపై జడ్జీలు చర్చించారు. ఈ పద్ధతి ఖర్చుతో కూడకున్నదని, ఇది పూర్తిగా వైరస్ ను అరికడుతుందా లేదా అనేది చూడాల్సి ఉందని జడ్జీలు ఆలోచనలో ఉన్నారు .ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఎయిర్ కండీషనర్ల వినియోగం నిలిపివేయాలని, దాని స్థానంలో కోర్టులోని అన్ని బ్లాకుల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని కోరిన విషయం తెలిసిందే .