కరోనా ఎఫెక్ట్ .. మార్చి 31 వరకు కర్ణాటక షట్ డౌన్.. రెండు నెలల రేషన్ ఫ్రీ
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది . ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 336కు చేరుకోగా ఆరుగురు మృతి చెందిన పరిస్థితి .ఇక పలు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తీరు టెన్షన్ పెడుతుంది. ఇక ఇప్పటివరకు కర్ణాటకలో 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కంట్రోల్ కోసం రెండు నెలల రేషన్ ఫ్రీగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
రెండు నెలల రేషన్ ఫ్రీగా ఇవ్వాలని కర్ణాటక సర్కార్ నిర్ణయం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటం కోసం ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు రాకుండా సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ప్రజలకు రెండు నెలల రేషన్ను ఫ్రీగా ఇవ్వనున్నట్లు కర్ణాటక సర్కార్ ప్రకటించింది . ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా సామాన్య ప్రజలకు నిత్యావసరాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రప్రజలను తమ ప్రయాణాలను 15 రోజులు వాయిదా వేసుకోవాలని యడియూరప్ప కోరారు. అటు అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణీకులకు స్క్రీనింగ్ నిర్వహిస్తారని సీఎం పేర్కొన్నారు .మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టెన్త్ క్లాసు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
కరోనాపై పోరాటానికి కర్ణాటక సర్కార్ సిద్ధం
ఈ పరీక్షల నిర్వహణకు కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. అయితే సోమవారం నుంచి మొదలుకానున్న ప్రీ యూనివర్సిటీ ఎగ్జామ్స్ మాత్రం యధాతధంగా కొనసాగుతాయన్నారు. ఇక కరోనా వ్యాప్తి నేపధ్యంలో అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించారు . బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో 1700 పడకలను సిద్దం చేశామని కరోనా బాధితులకు అక్కడే చికిత్స అందిస్తామని అన్నారు. అంతేకాకుండా ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ అనుమతులు మేరకు ప్రైవేటు, గవర్నమెంట్ ఆసుపత్రులలో కూడా ల్యాబ్ లు పెట్టి టెస్ట్ లు నిర్వహిస్తామన్నారు.
మార్చి 31 వరకు కర్ణాటక రాష్ట్రం తాత్కాలికంగా షట్ డౌన్
కరోనా వైరస్ వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మార్చి 31 వరకు కర్ణాటక రాష్ట్రం తాత్కాలికంగా షట్ డౌన్ చెయ్యనున్నారు . అయితే అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉందని కర్ణాటక సర్కార్ పేర్కొంది. ఇక ఇప్పటికే జనసమ్మర్ధం ఎక్కువ ఉండే థియేటర్లు , షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలను ఇప్పటికే మూసేసిన కర్ణాటక ఇక ఈ రోజు జరుగుతున్న జనతా కర్ఫ్యూలో ఎవరైనా రోడ్లపై కనబడితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.