కృష్ణాష్టమి వేడుకలపై కరోనా ఎఫెక్ట్: మధురతో పాటు ప్రధాన ఆలయాల్లో భక్తుల ప్రవేశం నిషేధం
మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన అవతారం శ్రీకృష్ణ అవతారం. లోక కల్యాణం కోసం కృష్ణుడిగా జన్మించిన నల్లనయ్య జన్మాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరగాల్సిన చోట కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ఇళ్లకే పరిమితమై కృష్ణ భక్తులు వేడుకలు జరుపుకుంటున్నారు.
మధురతో పాటు అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తులు లేకుండా వేడుకలు
శ్రీకృష్ణుడు జన్మించిన మధురలోని ప్రధాన ఆలయంతోపాటు , దేశవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ దేవాలయాలలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తుల రద్దీ లేకుండా సాంప్రదాయబద్ధంగా యధావిధిగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం అట్టహాసంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించే కృష్ణుని భక్తులు ఈసారి ఇళ్లకే పరిమితమై ఇళ్లలోని చిన్ని కృష్ణుడుకి స్వాగతం పలుకుతున్నారు. బుడిబుడి అడుగుల బుడతడిని ఇంట్లోకి రావయ్య అంటూ ఇళ్ళ ముందు పాదాలు వేసి స్వాగతం చెబుతున్నారు.
టీవీల ముందు కూర్చుని వేడుకలు తిలకిస్తున్న కృష్ణుడి భక్తులు
ఈసారి మధురతో పాటుగా అన్ని ప్రధాన దేవాలయాల్లో భక్తులు ప్రవేశాన్ని నిషేధించడంతో టీవీల ముందు కూర్చుని,ఆలయాలలో కృష్ణాష్టమి వేడుకలను తిలకిస్తున్నారు.
నల్లనయ్య పుట్టిన జన్మాష్టమి రెండు రోజులపాటు ఉండడంతో వరుసగా రెండు రోజుల పాటు వేడుకలు జరుపుకుంటున్నారు. కరోనా కట్టడి నేపథ్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆలయాలలో నిర్వహించినా, భక్తుల ప్రవేశానికి నిషేధం విధించినట్లు గా శ్రీకృష్ణ జన్మస్థాన సేవా సంస్థ కార్యదర్శి కపిల్ శర్మ పేర్కొన్నారు.
కరోనా వ్యాప్తి జరగకుండా నిర్ణయం .. మధురతో పాటు ఆ ఆలయాల్లో కూడా
యూపీలోని మధిరకు చెందిన శ్రీకృష్ణ జన్మస్థాన సేవాసంస్థ కార్యదర్శి కపిల్ శర్మ మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించాలని భావించి ఆలయాలలో భక్తుల సందర్శనకు నిషేధం విధించినట్లుగా తెలిపారు. మధురతో పాటుగా బృందావన్, గోవర్ధన్, నందగావ్, గోకుల్, బల్దేవ్, బర్సనా , మహా వన్ తదితర అన్ని పుణ్యక్షేత్రాలలో ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం వరకు భక్తుల ప్రవేశానికి నిషేధం విధించినట్లుగా తెలిపారు.
కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టే వేడుకలు
కరోనా వ్యాప్తి నివారించటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. భక్తులు శ్రీకృష్ణాష్టమి వేడుకలను దూరదర్శన్ తో పాటుగా ఇతర చానల్లో చూడవచ్చని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఇస్కాన్ ఆలయాల్లో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నప్పటికీ భక్తులు దర్శనాలకు నిషేధం ఉంది. వాడవాడలా, గ్రామ గ్రామాన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కరోనా నిబంధనల నేపధ్యంలో ఉట్టి కొట్టేందుకు బ్రేక్
ఈసారి కరోనా నిబంధనల అమలులో ఉన్న నేపథ్యంలో, ప్రజలు సమూహాలుగా ఉండకూడని పరిస్థితుల్లో ఉట్టి కొట్టే కార్యక్రమాలు కూడా లేకపోవడం ఒకింత నిరాశకు గురిచేస్తుంది. అయినప్పటికీ కృష్ణుడి భక్తులు నేడు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇళ్లలోనే జరుపుకుంటున్నారు.