మహారాష్ట్రలో మళ్ళీ కరోనా భయం .. మూడు నెలల గరిష్టానికి ముంబై తాజా కేసులు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్ళీ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం మహా సర్కార్ ను ఆందోళనకు గురి చేస్తోంది .మహారాష్ట్ర లో ఇప్పటివరకు 21,21,119 కేసులు నమోదు కాగా, 59,358 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు 20,08,623 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా , అత్యధికంగా 51,937 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1.6 కోట్ల కరోనా టెస్ట్ లు నిర్వహించారు. 10.3 లక్షల వ్యాక్సిన్ డోసులను ఇచ్చారు.
ముంబైలో మూడు నెలల గరిష్టానికి కరోనా కేసులు
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులలో అత్యధికంగా మహారాష్ట్ర లోనే ఎక్కువ కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తుంది. రోజువారీ కోవిడ్ -19 కేసులలో ముంబై మూడు నెలల గరిష్టాన్ని చూసింది. ముంబైలో తాజాగా 1,167 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి . ఇది 119 రోజులలో అత్యధికం అని చెప్పొచ్చు . చివరిసారిగా నగరంలో 1,167 కి పైగా కేసులు అక్టోబర్ 28 న నమోదైనట్టుగా తెలుస్తుంది.మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ప్రస్తుతం కరోనా హాట్ స్పాట్ గా తయారైంది . గత 24 గంటల్లో మహారాష్ట్రలో 8,807 కొత్త కేసులు నమోదయ్యాయి.
కరోనా కొత్త కేసులలో అమరావతి అతలాకుతలం
5,406 కరోనా కొత్త కేసులతో అమరావతి జిల్లా మహారాష్ట్ర లో రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరగడం పై జాతీయ వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అమరావతిలో కరోనా పాజిటివిటీ రేటు 50 శాతానికి చేరినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుదల గురించి, అలాగే కొనసాగుతున్న టీకా డ్రైవ్ గురించి డేటాను ప్రదర్శించారు. పరీక్ష, కాంటాక్ట్ ట్రేసింగ్ పెంచాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్ని జిల్లాలకు సూచించారని నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు.
కేసుల పెరుగుదలతో ,మరణాలు పెరుగుతాయన్న ఆందోళన
రాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఇంటెన్సివిస్ట్ డాక్టర్ రాహుల్ పండిట్, కేసుల పెరుగుదల ను ఉద్దేశించి కేసుల పెరుగుదల తరువాత 7-14 రోజుల తరువాత క్లిష్టమైన కేసులు లేదా మరణాల పెరుగుదల కనిపిస్తుంది, అని అభిప్రాయపడ్డారు. రాబోయే 10 రోజులు మరింత క్లిష్టంగా ఉంటాయని ఆయన అన్నారు. ముంబై సర్కిల్లో నిన్న బుధవారం ఒక్క రోజే 2,018 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో అత్యధికంగా, పూణే సర్కిల్లో 1,811 కేసులు నమోదయ్యాయి. విదర్భ ప్రాంతానికి చెందిన అకోలా మరియు నాగ్పూర్ సర్కిల్లలో వరుసగా 1,679 మరియు 1,323 కేసులు నమోదయ్యాయి.
ధారావిలోనూ నమోదవుతున్న కొత్త కేసులు , మహారాష్ట్రలో రెండు వేరియంట్లు
ఒక నెలకు పైగా విరామం తరువాత, ముంబైలోని మురికి వాడ అయిన ధారావి కూడా బుధవారం 10 గంటలకు కరోనా -19 కేసుల రెండంకెల సంఖ్యను నివేదించినట్లు నగర పౌర సంస్థ తెలిపింది. కరోనా వైరస్ యొక్క రెండు రకాలు భారతదేశంలో కనీసం మూడు రాష్ట్రాల్లో కనుగొనబడ్డాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
తాజా అంటువ్యాధులకి వారు కారణమని చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. . ఇక మహారాష్ట్రలో రెండు వేరియంట్లు ఉన్నాయి - N440K వేరియంట్ మరియు E484K వేరియంట్. ఈ వేరియంట్లు మహారాష్ట్ర, కేరళ మరియు తెలంగాణలో కూడా కనిపిస్తున్నాయి అని ఎన్ఐటిఐ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ అన్నారు.