ఖైదీలకు కరోనా భయం .. 'మహా ' జైళ్ళలో నరకం .. దారుణ స్థితిపై హైకోర్టు కీలక ఆదేశం
మహారాష్ట్రలో కరోనామహమ్మారి పంజా విసురుతోంది. కంట్రోల్ చేయలేని విధంగా కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ముంబై, పూణే నగరాలతోపాటుగా, పలు ప్రధాన పట్టణాలలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది.మహారాష్ట్ర పోలీస్ శాఖలోనూ, జైళ్ళలోనూ పెరిగిపోతున్న కరోనాకేసులు ఆందోళనకరంగా మారాయి. ఇదే సమయంలో జైళ్ళలో పరిస్థితిపై విచారణ జరిపిన ముంబై కోర్టు కరోనా కంట్రోల్ కోసం కీలక ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణాలో కరోనా రికార్డ్ బ్రేక్ .. హైకోర్టు మండిపడినా,ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నామారని సర్కార్
ముంబై జైళ్ళలో ఖైదీలకు కరోనా భయం
మహారాష్ట్రలోని జైళ్లలో కరోనా తీవ్రంగా విస్తరిస్తోంది.దుర్భేద్యమైన జైలుగోడల మధ్య,కటకటాల మధ్య నలిగిపోతున్న ఖైదీలకు, జైల్లో ఉన్న బాధ కంటే ఇప్పుడు కరోనా మహమ్మారి ఎప్పుడు తమను కాటేస్తుందో అన్న బాధ పెరిగిపోయింది. ఇప్పటికే వందల సంఖ్యలో ఖైదీలు, జైలు అధికారులకు కరోనా సోకింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు కరోనా బారిన పడి మహారాష్ట్ర జిల్లాలు నలుగురు ఖైదీలు మరణించారు.
మహారాష్ట్రలోని జైళ్లలో 363 మంది ఖైదీలు,102 మంది జైలు అధికారులకు కరోనా
మహారాష్ట్రలోని జైళ్ళు కరోనా కేంద్రాలుగా మారుతున్నా కరోనా కట్టడిలో మాత్రం తీవ్రంగా విఫలమవుతోంది మహా సర్కార్. ఇప్పటివరకు మహారాష్ట్రలోని జైళ్లలో 363 మంది ఖైదీలు, 102 మంది జైలు అధికారులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు తెలుస్తుంది. ముంబై నగరంలోని సెంట్రల్ జైలు లో అత్యధికంగా 181 మంది ఖైదీలు, 44 మంది జైలు సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. ముంబై తో పాటు తలోజా సెంట్రల్ జైలు , థానే సెంట్రల్ జైల్, బైకుల్లా జిల్లా జైలు, ఎరవాడ సెంట్రల్ జైలు, ఔరంగాబాద్ సెంట్రల్ జైల్, సతారా జిల్లా జైలు, షోలాపూర్, అకోలా , రత్నగిరి, ధూలే జిల్లా జైళ్లలో ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డారని మహారాష్ట్ర జైళ్ల శాఖ వెల్లడించింది.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జైల్లో ఖైదీలు... ముంబై కోర్టులో పలువురి పిటీషన్లు
ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కేసులతో జైల్లో ఉన్న ఖైదీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఎప్పుడు ఎవరిని కరోనా మహమ్మారి కాటేస్తుందో తెలియని భయానక పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర జైళ్లలో ఉన్న పరిస్థితిపై ముంబై హైకోర్టు దృష్టికి తీసుకు వెళుతూ కరోనా కేసులు తీవ్రత పెరిగిన దృష్ట్యా ఖైదీల ఆరోగ్య రక్షణపై పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.
కరోనా సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు , ర్యాండమ్ టెస్టులు చెయ్యాలని కోర్టు ఆదేశం
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు జైళ్ల శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది.మహారాష్ట్ర ఖైదీలకు ర్యాండమ్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దాదాపు 27 జిల్లాలలో ఉన్న తాత్కాలిక జైళ్ళ వివరాలను ఇవ్వాలని వాటిని తాత్కాలిక కరోనా సంరక్షణ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఖైదీలకు అందరిలాగే జీవించే సమానహక్కు ఉందన్న ముంబై హై కోర్టు
కరోనా వ్యాప్తి జరగకుండా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, ఖైదీలకు అందరిలాగే జీవించే సమానహక్కు ఉందని కోర్టు పేర్కొంది. ఖైదీల ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కూడా కోర్టు ఆదేశించింది .తాత్కాలిక కరోనా సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న జైళ్లను కూడా ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేయాలని ఆదేశించిన కోర్టు, ఖైదీల రక్షణ కోసం అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని పేర్కొంది.