మైసూర్ పాక్ తో కరోనా నయం .. ప్రచారం చేసిన స్వీట్ షాపు సీజ్ .. కేసు నమోదు
మైసూర్ పాక్ వల్ల కరోనా వైరస్ నయం అవుతుందని చెన్నైలోని ఒక షాపు యజమాని ప్రచారం అసలుకే ఎసరు పెట్టింది. షాప్ సీజ్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేసేలా చేసింది . తాజా కరోనా సమయంలో కరోనా పేరుతో బిజినెస్ చెయ్యాలని భావించిన వ్యక్తికి అధికారులు ఇచ్చిన షాక్ తో మైసూర్ పాక్ ల వ్యాపారమే కాదు మొత్తం స్వీట్ షాప్ మూత పడింది.
తమ షాపులో మైసూర్ పాక్ తింటే కరోనా నయం అని ప్రచారం
మైసూర్ పాక్ తినటం వల్ల కరోనా వైరస్ నయం అవుతుందని చెన్నైలోని ఒక స్వీట్ షాపు యజమాని ప్రచారం నిర్వహించారు . దీంతో ఆ వ్యక్తి నిర్వహించే స్వీట్ షాప్ ను అధికారులు సీజ్ చేశారు. కోయంబత్తూర్ జిల్లా తొట్టి పాళేయంలోని తిరునల్వేలి లాల స్వీట్ దుకాణ యజమాని శ్రీరామ్ తన దుకాణంలో ఔషధగుణాలున్న మైసూర్ పాక్ తింటే ఒకే రోజులో కరోనా నయమవుతుందని ప్రచారం మొదలు పెట్టారు. మూడు నెలలుగా తాము ఔషధగుణాలున్న మైసూర్ పాక్ లను తయారు చేసి విక్రయిస్తున్నా మని పేర్కొన్నారు.
ఫోటాన్ స్పీడ్ కరోనా క్యూర్ మైసూర్ పాక్.. ప్రత్యేకతలు ఇవే అని ప్రకటనలు
ఔషధగుణాలున్న మైసూర్ పాక్ కు ఆయన పేరు కూడా పెట్టారు. ఫోటాన్ స్పీడ్ కరోనా క్యూర్ మైసూర్ పాక్ అని పేరు పెట్టిన ఆయన దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇచ్చారు. ఇక ఈ ప్రకటనలలో దానిని ఏ విధంగా తినాలో కూడా చెప్పారు. 13 సార్లు నమిలి మింగాలి అని, తినే సమయంలో నోరు తెరవవద్దని, అలాగే చిన్నపిల్లలు అయితే మైసూర్ పాక్ లో సగ భాగం మాత్రమే తినాలని పేర్కొన్నారు. శ్రీరామ్, ప్రకటన ద్వారా, తన 'మైసూర్ పాక్ ' యొక్క మోతాదును మూడు రోజుల పాటు తీసుకోవాలని ,4 ముక్కలు ఒకే రోజులో తీసుకోవాలని ప్రజలకు సూచించాడు.
మైసూర్ పాక్ తింటే వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని ప్రచారం
శ్రీరామ్ 50 గ్రాముల తన మైసూర్ పాక్ ను 50 రూపాయలు ,1 కిలో ధర 800 రూపాయలకు అమ్ముతున్నట్టు పేర్కొన్నారు . రోగ లక్షణం లేని వ్యక్తులు రోగనిరోధక శక్తిని పెంచడానికి తీపిని కూడా తినవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు .తనకు తన తాత సిద్ధ వైద్యం నేర్పించారని, దాంతో కరోనాకు విరుగుడుగా ఔషధ మైసూర్ పాక్ ను తయారు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఇక తాము తయారుచేసిన మైసూర్ పాక్ తింటే వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని, కరోనా తగ్గిపోతుందని ప్రచారం చేసుకున్నారు సదరు లాలా స్వీట్ దుకాణ యజమాని.
సోషల్ మీడియాలో ప్రకటన వైరల్
ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కరోనా కు విరుగుడు మందు ఔషధ గుణాలున్న మైసూర్ పాక్ అని తప్పుడు ప్రచారం చేస్తున్న షాపు పై కొరడా ఝుళిపించారు ఆహార ఆరోగ్య శాఖ అధికారులు. షాప్ లో ఉన్న 120 కిలోల మైసూర్ పాక్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు లక్ష రూపాయలు. అనుమతులు లేకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం తప్పని అధికారులు అంటున్నారు. అంతేకాదు షాప్ యజమాని పై కేసు నమోదు చేసి, సదరు స్వీట్ షాప్ ను సీజ్ చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే సహించబోమని తేల్చి చెప్పారు.
స్వీట్ షాపు లైసెన్స్ రద్దు .. కేసు నమోదు
షాపు నిర్వహించడానికి అతనికి ఉన్న లైసెన్స్ ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. అంతేకాదు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 లోని సెక్షన్ 53 ప్రకారం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటన చేసినందుకు గానూ జరిమానా విధించడంతో పాటు గా, మరియు సెక్షన్ 61 ప్రకారం తప్పుడు సమాచారాని కి శిక్ష కూడా పడేలా అతనిపై చర్యలకు ఉపక్రమించారు ఫుడ్ సేఫ్టీ మరియు స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అంతేకాకుండా ఔషధగుణాలున్న మైసూర్ పాక్ అని ప్రచారం చేసిన స్వీట్స్ ను కూడా టెస్టింగ్ ల్యాబ్ కు పంపించారు.