కరోనా కష్టాలు .. తుమ్మినా, దగ్గినా డౌటే .. భయంలో ప్రజలు
కరోనా మహమ్మారి వ్యాప్తి ఎలా ఉన్నా కరోనా ప్రచారం మాత్రం భయంకరంగా మారింది. ఇక కరోనాకు జలుబు, దగ్గు , జ్వరం వంటి సాధారణ లక్షణాలు ఉండటంతో ఏ మాత్రం చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆస్పత్రులకు వెళ్ళాలంటే ప్రజలు భయపడుతున్నారు. కరోనా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని , నిర్లక్ష్యం పనికిరాదని జాగ్రత్త తప్పనిసరి అని చెప్తుంటే అది ప్రజలలో అవగాహనకు మించి ఆందోళన కలిగిస్తుంది .
ఇక పబ్లిక్ ప్లేస్ లలో తుమ్మినా , దగ్గినా కరోనా అని అనుమానం
ఇక పబ్లిక్ ప్లేస్ లలో తుమ్మినా , దగ్గినా , జ్వరంతో బాధ పడే వ్యక్తి కనిపించినా ఆమడ దూరం పారిపోతున్నారు. కరోనా అని భయపడుతున్నారు. సాధారణ వైరల్ ఫీవర్స్ కు కూడా కరోనానేమో అన్న భయం అటు సామాన్యులనే కాదు బాగా చదువుకున్న వారిని కూడా భయాందోళనకు గురి చేస్తుంది .వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం వైరస్ అనేది ఉమ్మడం, తుమ్మడం, దగ్గడం, ఇతరులను తాకడం ద్వారా వ్యాప్తి చెందుతుంది. అందుకే బయట ఎవరు దగ్గినా, తుమ్మినా , ఉమ్మినా , లక్షణాలు ఉన్నాయని అని అనుమానించేవారు తాకినా టెన్షన్ పడుతున్నారు.
ఆస్పత్రులకు వెళ్ళాలంటేనే భయపడుతున్న ప్రజలు
ఏ మాత్రం ఆరోగ్య సమస్య వచ్చినా ఆస్పత్రికి వెళ్లి చూపించుకునే జనాలు ఇప్పుడు కరోనా దెబ్బకు ఆస్పత్రులంటే హడలిపోతున్నారు. కరోనా అనుమానం అని ఐసోలేషన్ లో ఉంచుతారేమో అని భయపడుతున్నారు. ఇక కొందరు అనుమానితులుగా ఐసోలేషన్ లో ఉంచితే అక్కడ నుండి పారిపోతున్నారు. వ్యాధి కంటే భయంతోనే జనం సగం చచ్చిపోతున్నారు. ఇక కాస్త అనారోగ్యం ఉన్న వారు ఏదైనా వూరు వెళ్ళాలంటే ఇక వారికి చుక్కలు కనిపించే పరిస్థితి ఉంది .
కరోనా బాధితులని అనుమానం వస్తే అక్కడక్కడా దాడులు
ఇక అంతే కాదు కొన్ని చోట్ల కరోనా బాధితుడు అని అనుమానం వస్తే వారిపై దాడులకు దిగుతున్న పరిస్థితి భయాందోళనకు గురి చేస్తుంది. ఇక తాజాగా సైకిల్పై వెళ్తున్న వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తుమ్మాడని దానిపై నుంచి తోసేసి చితకబాదారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జరిగిన ఈ సంఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. గుజారీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ వీడియోలో మరో బైక్ రైడర్ తుమ్మిన వ్యక్తిని చేజింగ్ చేసుకుంటూ వచ్చి ఆపాడు. పబ్లిక్లో ఎందుకు తుమ్మావని, ముఖానికి హ్యాండ్ ఖర్చీఫ్ లాంటిది ఎందుకు అడ్డుపెట్టుకోలేదని ప్రశ్నించాడు.
చిన్నపాటి సాధారణ అనారోగ్యానికి భయపడుతున్న ప్రజలు
ఇలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని నీ లాంటి వాళ్ల అజాగ్రత్తే కొంపముంచుతుందని అతన్ని తిట్టినవారు తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని చెప్తున్నా వినకుండా పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. మహారాష్ట్రలో ప్రస్తుతం 49 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. కానీ కరోనా ఏ మాత్రం చిన్న అనారోగ్యం కలిగినా ఆస్పత్రికి వెళ్లేందుకు , జనాల మధ్య తిరిగేందుకు భయపడేలా చేస్తుంది . అందుకే చాలా మంది చిన్నపాటి అనారోగ్యం అయినా సెల్ఫ్ ఐసోలేషన్ పాటిస్తున్నారు .