
బాబోయ్.. 17వేలను దాటిన కరోనా కొత్తకేసులు; నిర్లక్ష్యం చేస్తే మరో ఉప్పెన.. బీ అలెర్ట్!!
భారతదేశంలో కరోనా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న కేసులతో దేశంలో కొత్త ఆందోళన మొదలైంది. కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. గత 24 గంటల్లో దేశంలో 17,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవడంతో భారతదేశం యొక్క క్రియాశీల కోవిడ్-19 కేసుల సంఖ్య శుక్రవారం 88,284కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 19 నుండి దేశంలో 22,270 ఇన్ఫెక్షన్లు నమోదైనప్పటి నుండి రోజువారీ కోవిడ్-19 కేసులలో ఇది అతిపెద్ద స్పైక్ అని చెప్పవచ్చు.

తాజాగా 17,336 కొత్త కేసులు, 13 మరణాలు
దేశంలో తాజాగా 17,336 కొత్త కేసులు నమోదు కాగా,13 కొత్త మరణాలతో సంభవించాయి. తాజాగా నమోదైన మరణాలతో కలిపి భారతదేశ మరణాల సంఖ్య 5,24,954కి పెరిగింది. మరోవైపు, కోవిడ్-19 నుండి ఇప్పటివరకు 4,27,49,056 మంది రోగులు కోలుకున్నారు, గత 24 గంటల్లో 13,029 మంది కోలుకున్నారు. ప్రస్తుతం, భారతదేశంలో కరోనా కేసుల మరణాల రేటు 1.21 శాతం కాగా, రికవరీ రేటు 98.59 శాతంగా ఉన్నాయి.

మహారాష్ట్రలో కరోనా పంజా.. దేశంలో కేసుల పెరుగుదలకు కారణమిదే
భారతదేశంలో కరోనా కేసులు పెరగడంలో మహారాష్ట్రలో అధికంగా నమోదవుతున్న కరోనా కేసులు కారణంగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో తాజాగా 5,218 కొత్త కేసులు మరియు ఒక మరణం నమోదయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ఒక్క ముంబైలోనే 2,479 కేసులు నమోదయ్యాయి. భారతదేశం యొక్క రోజువారీ గణనలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్రలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 79,50,240 కాగా, ఇప్పటివరకు మహారాష్ట్రలో 1,47,893 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

ఢిల్లీ కరోనా కేసుల్లోనూ పెరుగుదల, తమిళనాడులో తాజాగా 1,063 కేసులు
ఢిల్లీ రోజువారీ కేసులలో భారీ పెరుగుదలను చూసింది. 1,934 కొత్త ఇన్ఫెక్షన్లను 8.10 శాతం పాజిటివ్ రేటుతో దేశ రాజధాని ఢిల్లీ నివేదించింది. దీంతో దేశ రాజధాని మొత్తం కేసుల సంఖ్య 19,27,394కి చేరింది. తమిళనాడులో గత 24 గంటల్లో 1,063 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,64,131కి చేరుకుంది. ఆరోగ్య శాఖ ప్రకారం, ఒక్క చెన్నైలోనే 497 కొత్త కేసులు నమోదయ్యాయి.

వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసుల పరిస్థితి ఇలా
పశ్చిమ బెంగాల్లో కూడా 745 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేసుల సంఖ్య 20,23,587కి చేరుకుంది. ఫిబ్రవరి 7 తర్వాత రాష్ట్రంలో ఒక్కరోజులో 700కు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అంతేకాకుండా, కర్ణాటకలో 858 కొత్త కేసులు మరియు ఒక మరణం నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య39,63,633కి చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 40,072కి చేరుకుంది. ఇక గుజరాత్ రాష్ట్రంలో 416 కేసులు, గోవాలో 151 కేసులు, ఛత్తీస్ ఘడ్ లో 114 కేసులు, తెలంగాణ రాష్ట్రంలో 494 కేసులు నమోదయ్యాయి.

కరోనా కేసుల పెరుగుదలతో పరిస్థితి సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి .. కీలక ఆదేశాలు
భారతదేశంలో కేసులు పెరుగుతాయని నివేదించడంతో, దేశంలో కోవిడ్-19 స్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గురువారం కీలక అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నిఘా, జీనోమ్ సీక్వెన్సింగ్, ఆసుపత్రిలో చేరే వారిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు తగినంత టీకా మోతాదులు అందుబాటులో ఉన్నందున, అర్హులైనవారికి, బలహీన వర్గాల ప్రజలకు టీకాను వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తూ వ్యాక్సిన్ వృధా కాకుండా వినియోగించాలని ఆయన ఆదేశించారు.