54 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ .. హర్యానాలోని కర్నాల్ లో స్కూల్ మూసివేత , సర్కార్ అలెర్ట్
భారతదేశంలో కరోనా కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. ఏడాది కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.
మహారాష్ట్రలో మళ్ళీ కరోనా భయం .. మూడు నెలల గరిష్టానికి ముంబై తాజా కేసులు
ఒకే స్కూల్ లో 54 మందికి కరోనా పాజిటివ్
గత ఏడాది విద్యా సంవత్సరం అంతా విద్యార్థులు స్కూల్ కు వెళ్ళక విద్యా సంవత్సరం వ్యర్థం కాగా, ఇటీవల పాఠశాలలకు వెళ్ళడం ప్రారంభించారు. ఈ సమయంలో మరోమారు కరోనా రక్కసి విద్యార్థుల పై పంజా విసరడం హర్యానా రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది. హర్యానాలోని కర్నాల్లోని ఒక పాఠశాలలో యాభై నాలుగు మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. డిసెంబరులో రాష్ట్రం 9 నుండి 12 తరగతుల విద్యార్థులను పాఠశాలలకు వెళ్ళడానికి ప్రభుత్వం అనుమతించింది. ఫిబ్రవరి 24 నుండి 3 నుండి 5 తరగతుల వారికి కూడా పాఠశాలలను పునఃప్రారంభించారు.
స్కూల్ హాస్టల్ భవనం మూసివేత , కంటైన్మెంట్ జోన్ గా ప్రకటన
కర్నాల్లోని పాఠశాల విద్యార్థులు ఒకేసారి 54 మంది కరోనా బారిన పడటం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది . ముందు ముగ్గురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. ఆ తర్వాత కాంటాక్ట్-ట్రేసింగ్ , ఎక్కువ మంది విద్యార్థులను పరీక్షించిన తరువాత, 54 మంది కరోనా పాజిటివ్ గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాఠశాల యొక్క హాస్టల్ భవనం మూసివేసి కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ప్రస్తుతం స్కూల్ మూసివేసి శానిటైజేషన్ చేస్తున్నారు. స్కూల్ విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
స్కూల్స్ నిర్వహణ విషయంలో హర్యానా సర్కార్ ఉత్తర్వులు
స్కూల్స్ విషయంలోఫిబ్రవరి 22 న ఒక ఉత్తర్వులో, హర్యానా ప్రభుత్వం ప్రతి పాఠశాలను మూడు విభాగాలుగా చేశారు. ఒక విభాగంలో ఉన్న విద్యార్థి కరోనా పాజిటివ్ అని తేలితే, ఆ విభాగం 10 రోజులు మూసివేయబడుతుందని , పాఠశాల మొత్తం శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. ఒకటి కంటే ఎక్కువ విభాగాలలోని విద్యార్థులు కోవిడ్-19 పాజిటివ్గా ఉన్నట్లు తేలితే, మొత్తం పాఠశాల 10 రోజులు మూసివేయబడుతుంది.
గతంలో కేరళలో స్కూల్ లో విద్యార్థులకు పాజిటివ్ , ఇప్పుడు హర్యానాలో సేమ్ సీన్
ఒక పక్క ఆన్లైన్ తరగతులతో పాటుగా మరోపక్క పాఠశాలలో ఆఫ్ లైన్ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు.
మహారాష్ట్ర, పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల మధ్య పాఠశాలలు జాగ్రత్తగా పునఃప్రారంభించారు. ఫిబ్రవరిలో, కేరళలోని మలప్పురంలోని రెండు పాఠశాలలకు చెందిన 192 మంది విద్యార్థులకు 72 మంది స్టాఫ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా హర్యానాలోని 54 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అప్రమత్తమైన హర్యానా సర్కార్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.