కేజ్రీవాల్ భార్యకు కరోనా పాజిటివ్: ఐసోలేషన్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది . చివరకు కరోనా సెగ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా తాకింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ మంగళవారం కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కు చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు.
అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్
ఇక అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో , ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా హోం ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు . ఢిల్లీలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సోమవారం రాత్రి నుండి అమల్లోకి వచ్చిన ఆరు రోజుల లాక్డౌన్ సందర్భంగా ఇంట్లోనే ఉండాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ప్రజలందరి ఆరోగ్యం మరియు భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.ఈ రోజు ఢిల్లీలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఇదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ కరోనా బారిన పడడంతో ఆయన కూడా సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు.
హోం క్వారంటైన్ అయిన ఢిల్లీ సీఎం .. అయినా కరోనా పరిస్థితిపై సమీక్ష
ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన వెల్లడించారు . కేజ్రీవాల్ తనను తాను హోమ్ క్వారంటైన్ చేసుకున్నప్పటికీ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని విమర్శనాత్మకంగా సమీక్షిస్తున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు దుర్గేశ్ పాథక్ తెలిపారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ బృందాలు కూడా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి అని పాథక్ తెలిపారు.
అరవింద్ కేజ్రీవాల్ గత సంవత్సరం కూడా కోవిడ్ మహమ్మారి బారిన పడి కొన్ని రోజులు అనారోగ్యంతో ఉన్నారు.
ఇప్పటికే కరోనా బారిన పడిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు
కేజ్రీవాల్ , డిప్యూటీ మనీష్ సిసోడియా, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, పార్టీ ప్రతినిధి రాఘవ్ చాధాతో సహా ఆప్ కు చెందిన పలువురు నాయకులు కూడా ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నారు. ఢిల్లీలో ఇటీవల కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగాయి. దేశ రాజధాని కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్ననగరంగా మారింది. నగరంలో నేడు 23,000 కేసులు నమోదయ్యాయి, ఢిల్లీలో మొత్తం కరోనా కేసులు 8.77 లక్షలకు పైగా ఉన్నాయి.