యూఏఈలో గర్భిణీ ప్రియాంకకు కరోనా: తల్లీ, బిడ్డను కాపాడిన తుంబే ఆస్పత్రి, అన్నీతామై..
అబూదాబి: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని అజ్మన్ నగరంలో భారతీయ దంపతులు ఉంటున్నారు. కాగా, గర్భిణీ అయిన మహిళ కరోనా మహమ్మారి బారినపడింది. క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆమె తాను పనిచేస్తున్న ఆస్పత్రిలోనే చేరింది. ఆ తర్వాత ఆమెను ఐసీయూలో చేర్చారు. పుట్టే బిడ్డకు కరోనా సోకకుండా సీజేరియన్ చేశారు వైద్యులు. దీంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఇప్పుడు క్షేమంగా ఉన్నారు.
కరోనా బారిన పడిన ప్రియాంక..
ప్రియాంక, ఆమె భర్త సోమేష్ అజ్మన్ నగరంలో ఉంటున్నారు. పండంటి బిడ్డ పుట్టడం, ఆ శిశువుకు కరోనా సోకకపోవడంతో ఈ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన అనుభవాల గురించి ప్రియాంక మాట్లాడుతూ.. తాను ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న సమయంలోనే ఉన్నట్టుండి ఒక రోజు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిందని చెప్పింది. జ్వరంగా కూడా అనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో ప్రియాంకకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో వెంటనే ఆస్పత్రిలో చేరింది.
బిడ్డకు కరోనా సోకకుండా డెలివరీ..
ప్రియాంక అనారోగ్యం మరింతగా క్షీణించడంతో ఆమెను ఐసీయూలోకి తరలించారు. 33 వారాల గర్భిణీ అయిన ఆమెకు సీజేరియన్ చేసి బిడ్డను ఆరోగ్యంగా బయటికి తీయాలని వైద్యులు తలచారు. అనుకున్నట్లుగానే ఆమెకు సిజేరియన్ చేశారు. ప్రియాంకకు పండింటి బిడ్డ పుట్టింది. వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించి బిడ్డకు కరోనా సోకలేదు. వైద్యులు తన ప్రాణాలతోపాటు తన బిడ్డ ప్రాణాలు కూడా కాపాడారని ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు.
కరోనాను జయించిన ప్రియాంక..
కాగా, దాదాపు నెల రోజులపాటు శిశివును న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఎన్ఐసియూ)లోనే ఉంచారు. బిడ్డతోపాటు తన భార్య క్షేమంగా ఆస్పత్రి నుంచి ఇంటికి రావాలని ప్రియాంక భర్త సోమేష్ అందరు దేవుళ్లను ప్రార్థించారు. ఈ క్రమంలో ప్రియాంక క్రమంగా కోలుకుంది. చివరకు కరోనాను కూడా జయించి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి.
Recommended Video
పూర్తి ఆరోగ్యంతో ఇల్లు చేరిన ప్రియాంక, ఆమె కూతురు
ప్రియాంకతోపాటు ఆమె కూతురు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇక త్వరలోనే కేరళలోని సొంతూరుకు వచ్చేందుకు సోమేష్ సిద్ధమయ్యారు. వైద్య ఖర్చులన్నీ తాను పనిచేసే తుంబే ఆస్పత్రి యాజమాన్యమే భరించిందని ప్రియాంక వెల్లడించింది. కరోనా రోగులకు అందించిన వైద్య సేవలకు గానూ తాము ప్రియాంక, ఆమె కూతురు వైద్య ఖర్చులను భరించామని ఆస్పతరి యాజమాన్యం తెలిపింది. తుంబే ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులకు ప్రియాంక, ఆమె భర్త సోమేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.