షాకింగ్ .. కరోనా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ .. రెండోసారి చాలా తీవ్రంగా వైరస్ దాడి చేస్తుందన్న రీసెర్చ్
కరోనావైరస్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి . అయితే ఈ మహమ్మారి విషయంలో తాజాగా పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి . కరోనా సోకి తర్వాత నయం అయిన వ్యక్తి శరీరంలో ఉన్న యాంటీ బాడీస్ తో మళ్ళీ కరోనా సోకదు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ అదంతా తప్పని తాజా అధ్యయనం తేల్చింది. అంతే కాదు ఒక సారి కరోనా బారిన పడి నయమైన వ్యక్తికి రెండో సారి కరోనా సోకితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అధ్యయనం వెల్లడిస్తుంది.
Recommended Video
ఎక్కువ సార్లు కరోనా వచ్చే ప్రమాదం .. అధ్యయనంలో వెల్లడి
కోవిడ్ -19 రెండవ సారి సోకినప్పుడు మరింత తీవ్రమైన లక్షణాలతో ఇబ్బంది పడతారని, మంగళవారం విడుదల చేసిన పరిశోధనల ప్రకారం తెలుస్తుంది .కరోనా ప్రాణాంతక మహమ్మారి ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చే అవకాశం ఉందని అధ్యయనం నిర్ధారించింది . ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ చార్టులలో ప్రచురించబడిన ఒక అధ్యయనం, యునైటెడ్ స్టేట్స్ లో కోవిడ్ -19 రీఇన్ఫెక్షన్ కేసుపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడించింది .
అధ్యయనంలో మొదటిసారి కంటే రెండో సారి తీవ్రంగా వైరస్ దాడి
25 ఏళ్ల నెవాడాకు చెందిన వ్యక్తి, 48 రోజుల కాలపరిమితిలో, రెండు సార్లు కోవిడ్ -19 వైరస్ బారిన పడ్డాడు. రెండవ సారి అతనికి ఇన్ఫెక్షన్ మొదటిదానికంటే చాలా తీవ్రంగా ఉంది, ఫలితంగా రోగి ఆక్సిజన్ సహాయం తప్పనిసరి కావటంతో ఆస్పత్రి పాలయ్యాడు . బెల్జియం, నెదర్లాండ్స్, హాంకాంగ్ మరియు ఈక్వెడార్ లలో ఒక్కొక్క రోగి చొప్పున ప్రపంచవ్యాప్తంగా మరో నాలుగు రీఇన్ఫెక్షన్ కేసులను ఈ పత్రిక గుర్తించింది. కరోనాకు గురైన వ్యక్తులకు రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం అని పేర్కొంది .
కరోనా ఒకసారి సోకి తగ్గితే రాదనే భ్రమల్లో ఉండొద్దు .. అప్రమత్తత అవసరం
రెండవ సారి కరోనా వైరస్ సోకటం అరుదుగా ఉన్నప్పటికీ, సోకిన వారికి లక్షణాలు ఎందుకు ఇంత తీవ్రంగా కనిపిస్తున్నాయి అనేది మాత్రం తెలియాల్సి ఉందని అధ్యయనం పేర్కొంది . ఇది వైరస్ యొక్క మరింత తీవ్రమైన జాతి అయి ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు . అయితే కరోనా సోకిన వారు మళ్ళీ రాదనే భ్రమల్లో ఉండకూడదని , రెండో సారి సోకితే మాత్రం మరింత ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు . రెండవ సారి సోకితే కచ్చితంగా ఆస్పత్రిలో చేరి తీవ్ర పోరాటమే చెయ్యాల్సి వస్తుందని అంటున్నారు.