దేశంలో దారుణంగా కరోనా స్థితి ... వివిధ రాష్ట్రాల్లో తాజా పరిస్థితి ఇదే !
భారతదేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ ఉద్ధృతి విపరీతంగా పెరగడంతో ఆస్పత్రులలో పడకల లభ్యత ,ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందులు అందుబాటులో ఉంచడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ గా మారింది . వివిధ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న పరిస్థితులు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న రాష్ట్రాలలో తాజా పరిస్థితి ఎలా ఉందంటే..
మళ్ళీ మొదలైన వలస కార్మిక వెతలు .. ఢిల్లీలో లాక్ డౌన్ తో 2020 సీన్ రిపీట్
మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా బీభత్సం
కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలో డబుల్ మ్యూటాంట్ వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్రలోగత 24 గంటల్లో 58,924కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తంకేసుల సంఖ్య 38.98 లక్షలకు పైగా ఉన్నాయి.నిన్న ఒక్కరోజే 351 కొత్త మరణాలునమోదు కాగా,మొత్తం మరణాల సంఖ్యను 60,824 కు పెంచాయి.మొత్తంకేసుల విషయానికొస్తే, మహారాష్ట్ర తరువాత దక్షిణ రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
ఢిల్లీలో తాజా పరిస్థితి ఇదే
దేశ రాజధానిలో దిగజారుతున్న కరోనా పరిస్థితి మధ్య ఢిల్లీ 6 రోజుల లాక్డౌన్లో ఉంది. ఢిల్లీలో గత 24 గంటల్లో, 240 మరణాలు సంభవించాయి . అంటే గంటకు పది మంది చొప్పున ఢిల్లీలో ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 23,686 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో అమలవుతున్న కఠిన ఆంక్షల మధ్య వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. ప్రధాన బస్ స్టేషన్లలో వలస కార్మికుల రద్దీ కనిపిస్తుంది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో కొనసాగుతున్న రైతుల ఆందోళనపై కూడా కరోనా ప్రభావం కనిపిస్తుంది.
కేరళలో రెండు వారాలపాటు రాత్రి కర్ఫ్యూ
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కోవిడ్-19 కేసుల పెరుగుదల మధ్య కేరళలో రెండు వారాల పాటు రాత్రి కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జనవరిలో భారతదేశపు మొదటి కరోనావైరస్ కేసును చూసిన కేరళ - గత 24 గంటల్లో 13,644 కొత్త కరోనా కేసులను నివేదించింది. కేసుల పెరుగుదల రోజు రోజుకు ఉధృతంగా మారుతున్న నేపథ్యంలో కేరళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక లో కీలక నిర్ణయాల దిశగా సర్కార్
కర్ణాటకలో పెరుగుతున్న కేసులో దృష్ట్యా కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా సర్కార్
కర్ణాటక గవర్నర్ ఈ రోజు బెంగళూరులో రాష్ట్ర రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు . ఆ సమావేశం తరువాత, రాష్ట్రంలో, ముఖ్యంగా రాజధాని బెంగళూరులో కేసుల భారీ పెరుగుదలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు ప్రకటించాలని భావిస్తున్నారు. కర్ణాటకలో గత 24 గంటల్లో 15,785 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో పెరిగిపోయిన కరోనా కేసులు, తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధింపు
తెలంగాణలో, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా జరిగిన బహిరంగ సభ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరియు 60 మంది కోవిడ్ పాజిటివ్గా మారడానికి కారణమని భావిస్తున్నారు. పెరుగుతున్న కోవిడ్ కేసులను పరిష్కరించడానికి లాక్డౌన్ పై నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు రెండు రోజుల అల్టిమేటం ఇచ్చింది. తెలంగాణా రాష్ట్రంలో నేటి నుండి నైట్ కర్ఫ్యూ విధించారు .
ఉత్తరప్రదేశ్లో 5 నగరాల్లో లాక్ డౌన్ విధించాలని హైకోర్టు ఆదేశం.. నిరాకరిస్తున్న సర్కార్
కరోనావైరస్ కేసులు రోజువారీ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుండి ఏప్రిల్ 26 వరకు లక్నో, ప్రయాగ్ రాజ్ , వారణాసి, కాన్పూర్, గోరఖ్పూర్ అనే ఐదు నగరాలను లాక్డౌన్ చేయమని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను పాటించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సోమవారం సాయంత్రం నిరాకరించింది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం 28,211 కొత్త కేసులను మరియు 167 మరణాలు నమోదు చేసింది.
ఏపీలోనూ కరోనా పంజా .. తాజా పరిస్థితి ఇదే
ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న జగన్ సర్కార్ మాత్రం కరోనా కట్టడికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతోపాటు , టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా పరిస్థితి కట్టడి చెయ్యటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి కేసులు పెరుగుతున్నా లాక్ డౌన్ గురించి ఆలోచించటం లేదు. ప్రస్తుతం 1 నుండి 9 వ తరగతి వరకు కరోనా కారణంగా స్కూల్స్ మూసివేసిన సర్కార్ , పదవతరగతి , ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది .