వాహనదారులకు కరోనా ట్యాక్స్ .. ప్రజలకు షాకింగ్ న్యూసే !!
కరోనా లాక్ డౌన్ ప్రభావంతో తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు గత వారం రోజుల నుండి పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అన్ని రాష్ట్రాలు కరోనా లాక్డౌన్ ప్రభావం వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇక ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి మార్గాలను అన్వేషిస్తున్నాయి . ఈ క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. సామాన్యులకు కరోనా కష్టకాలంలో భారంగా మారింది.
Recommended Video
గత 24 గంటల్లో 11వేలకు చేరువలో కొత్త కరోనా కేసులు: లాక్ డౌన్ రూల్స్ పై పునరాలోచిస్తున్నపలు రాష్ట్రాలు
పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై కరోనా టాక్స్ వేస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
అసలే పనుల్లేక, రెండు నెలలకు పైగా ఇళ్లకే పరిమితమై ఇప్పుడిప్పుడే తిరిగి పనులు మొదలుపెట్టిన ప్రజలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కరోనా టాక్స్ పేరుతో పెద్ద షాక్ ఇచ్చింది. అసలే సంపాదన లేక బతుకు భారంగా మారిన వారికి కరోనా టాక్స్ కూడా చెల్లించాలంటూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం అసహనానికి గురి చేస్తోంది. కరోనా టాక్స్ పేరుతో వాహనదారులపై మరింత భారం మోపేందుకు సిద్ధమైన మధ్య ప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై కరోనా టాక్స్ ను వసూలు చేయనుంది.ఇక ఈ నిర్ణయం ఈ రోజు నుండి అమల్లోకి వస్తున్నట్లుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.
నేటి నుండి అమల్లోకి .. పెట్రోల్ , డీజిల్ పై 1 రూపాయి కరోనా సెస్
వాణిజ్య పన్ను శాఖ ఆదేశాల మేరకు నేటి నుండి ఈ పెరుగుదల అమల్లోకి వస్తుంది. మధ్యప్రదేశ్ లో వరుసగా పెట్రోలు డీజిల్ పై మూడున్నర రూపాయలు, రెండు రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు కరోనా టాక్స్ పేరుతో ఒక్క రూపాయి అదనంగా వసూలు చెయ్యనుంది. నాలుగున్నర రూపాయలు పెట్రోల్ పై, అలాగే మూడు రూపాయలు డీజిల్ పై వసూలు చేయనున్నారు. కరోనా ట్యాక్స్తో కలుపుకుని రాష్ట్రంలో పెట్రోలు ధర లీటరు రూ. 82.64కు పెరగ్గా, డీజిల్ ధర రూ. 73.14కు చేరుకుంది.సెస్ పెంపు వల్ల ప్రభుత్వానికి ఏటా రూ .200 కోట్లు పెట్రోల్ ద్వారా , డీజిల్ అమ్మకం ద్వారా రూ .370 కోట్లు అదనపు ఆదాయం వస్తుందని అంచనా.
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ప్రజలపై కరోనా ట్యాక్స్ భారం
ఇక గత రెండు నెలలుగా లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలు కుదేలయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. చాలా వ్యాపారాలు నష్టపోగా చాలా వరకు కంపెనీలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం మానేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారాయి .ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగటంతో వారు ఆందోళన చెందుతున్నారు.ఇక పైపెచ్చు ప్రభుత్వం మూలిగే నక్కమీద తాటికాయ వేసినట్లుగా కరోనా టాక్స్ కూడా విధించడం మధ్యప్రదేశ్ వాసులకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.