భారత రక్షణాశాఖ కార్యాలయంలో కరోనా టెన్షన్ .. సౌత్ బ్లాక్ మూసివేత.. సెక్రటరీకి కరోనా !!
భారతదేశ రక్షణాశాఖలో ఇప్పుడు కరోనా కలకలం మొదలైంది. రక్షణాశాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న రక్షణాశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కు కరోనావైరస్ సోకినట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో రక్షణాశాఖ అప్రమత్తమైంది. దీంతో ఆయనకు వైద్య చికిత్స అందించడంతో పాటుగా, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారినందరినీ హోమ్ క్వారంటైన్ కి పంపించే పనిలో ఉన్నారు అధికారులు.
corona India update : మహమ్మారి పంజా ..గత 24 గంటల్లో 9,304 కొత్త కేసులతో బిగ్గెస్ట్ జంప్
ఇక ఇప్పటికే ఢిల్లీలోని రైసినా హిల్స్ లో ఉన్న రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంలో సౌత్ బ్లాక్ మూసివేసి పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తో గత రెండు రోజులుగా 35మంది సన్నిహితంగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇక ఈయన విధులు నిర్వర్తించిన సౌత్ బ్లాక్ ఆఫీసులో మొదటి అంతస్తులో త్రివిధ దళాధిపతులకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి.ఇక ఆయన పని చేసిన సౌత్ బ్లాక్ లో రక్షణ శాఖ మంత్రి, రక్షణ కార్యదర్శి, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ కార్యాలయాలు ఉండడం గమనార్హం. రక్షణశాఖను సైతం కరోనా తాకడంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది.
ఇక రక్షణ శాఖ ఉన్నతాధికారికే కరోనా పాజిటివ్ అని తేలడంతో రక్షణ శాఖ మంత్రి కూడా సౌత్ బ్లాక్ కు రావడం లేదు అని సమాచారం. రక్షణశాఖ ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో గత రెండు రోజులుగా రక్షణశాఖకు చెందిన చాలామంది అధికారులు విధులకు హాజరు కావడం లేదు. కానీ కరోనా పాజిటివ్ గురించి అధికారికంగా ధ్రువీకరించటం లేదు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రక్షణ శాఖ అధికారికి కరోనా పాజిటివ్ అని తెలిసిన నేపథ్యంలో ఆయన కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గా తెలుస్తుంది. ప్రస్తుతం అజయ్ కుమార్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.ఇక ఈ నేపథ్యంలోనే సౌత్ బ్లాక్ లో ఉన్న ఉద్యోగులందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు అధికారులు. గత కొన్ని రోజులుగా రక్షణశాఖ కార్యదర్శి ఎవరెవరితో కలిశారు అన్న దానిపై దృష్టి సారించిన అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.