కరోనా టెన్షన్ లోనూ ఉలిక్కిపడ్డ కాశ్మీర్ .. ఎన్ కౌంటర్ ..ఇద్దరు ఉగ్రవాదులు హతం
కరోనా భయంతో తీవ్రమైన ఆందోళనతో ప్రజలు బ్రతుకు వెళ్ళదీస్తుంటే కాశ్మీర్ లో ఊహించని పరిణామం జరిగింది. కాశ్మీర్ ఒక్కసారిగా ఎన్ కౌంటర్ తో ఉలిక్కిపడింది . ఉగ్ర దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపద్రవం ముంచుకొస్తుందని ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపధ్యంలో అలెర్ట్ అయిన భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను మట్టు పెట్టింది .
ఓ వైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతుంటే మరోవైపు ఉగ్రవాదులు ఇదే అదనుగా దాడులకు ప్లాన్లు వేస్తున్నారని తెలుస్తుంది . గత కొన్నేళ్లుగా దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నా వారి ప్రయత్నాలు ఫలించలేదు . ఎప్పటికప్పుడు మన సైన్యం వారి వ్యూహాలకు చెక్ పెట్టింది. ఇప్పుడు దేశం అత్యవసర సమయంలో ఉండగా ప్రతి వ్యక్తి కరోనా కట్టడికి యుద్ధం చేస్తున్నారు . ఇక ఇదే అదునుగా ఉగ్ర దాడులకు స్కెచ్ వేస్తున్నారని టెలిగ్రాం ద్వారా రహస్య మంతనాలు సాగించారని లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీస్ సెక్యూరిటీ పెంచాలంటూ ఐబీ హెచ్చరించింది.
Recommended Video
ఇక ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్లోని కుల్గాం ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నట్లు జవాన్లకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, భద్రతాబలగాలు కుల్గాం పట్టణంలో కూంబింగ్ నిర్వహించారు . ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతాబలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకున్నారు . ఇక వారి కోసం భద్రతాబలగాలు గాలింపు చేస్తున్నాయి.