కరోనాతో సతమతం అవుతున్న వేళ..జమ్మూ కాశ్మీర్ లో కాల్పులు .. ఇద్దరు ఉగ్రవాదులు హతం
కరోనా భయం భారత దేశ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే కాశ్మీర్ లో మాత్రం ఇదే అదునుగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కాశ్మీర్ ఒక్కసారిగా ఎన్ కౌంటర్ తో ఉలిక్కిపడింది. ఉగ్ర దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపద్రవం ముంచుకొస్తుందని ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపధ్యంలో భారత సైన్యం కరోనా ఇండియా లోకి ఎంటర్ అయిన నాటి నుండి కంటి మీద కునుకు లేకుండా పహారా కాస్తూనే ఉంది .
కరోనా మహమ్మారితో ఇండియా అతలాకుతలమవుతుంటే మరోవైపు ఉగ్రవాదులు ఇదే అదనుగా చొరబడి దాడులకు ఎత్తుగడలు వేస్తున్నారు . ఇక ఆ ఎత్తులను చిత్తు చేస్తున్నారు సైనికులు. ఇక ఇదే క్రమంలో జమ్మూ కశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దక్షిణ కశ్మీర్ షోపియన్ జిల్లాలోని మెల్హురా ప్రాంతంలో జరిగింది. మెల్హురా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు, పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఇక పోలీసుల తనిఖీలతో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఎదురుకాల్పుల్లో మరో ఉగ్రవాది కూడా మృతి చెందగా.. మూడో ఉగ్రవాది కాల్పులు జరిగిన ప్రాంతంలోనే చిక్కుకుపోయినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు ట్వీటర్లో పేర్కొన్నారు.
ఇక మూడో ఉగ్రవాది ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మృతి చెందినవారు ఏ ఉగ్రసంస్థకు చెందినవారో కూడా ఇంకా గుర్తించలేదని పోలీసులు పేర్కొన్నారు.ఇక ఇటీవల జమ్ముకశ్మీర్లోని కుల్గాం ప్రాంతంలో కూడా పోలీసులు ఉగ్రవాదులను గుర్తించి హతమార్చారు .పోలీసులు, భద్రతాబలగాలు కుల్గాం పట్టణంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతాబలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.